- కుట్రకోణం ఉందని టీవీకే పార్టీ ఆరోపణ
విద్యుత్ సరఫరాను నిలిపివేశారని విమర్శలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తమిళనాడులోని కరూర్ జిల్లాలో టీవీకే వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట ఘటన తమిళనాడులో రాజకీయం దుమారం రేపుతోంది. రెండు రోజుల క్రితం టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మందికిపైగా మరణించడం.. పదుల సంఖ్యలో గాయపడటం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం, టీవీకే పార్టీల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర ఉందని, విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంతసేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని టీవీకే పార్టీ ఆరోపించింది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో విజయ్ను చూసేందుకు అభిమానులు ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని ఆ పార్టీ పేర్కొంది.
టీవీకే అభ్యర్థనను తిరస్కరించాం..
ఈ ఆరోపణలపై తమిళనాడు విద్యుత్ బోర్డు తీవ్రంగా స్పందించింది. విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని టీవీకే పార్టీయే తమకు వినతిపత్రం ఇచ్చిందని రాష్ట్ర విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి తెలిపారు. అయితే, తాము అందుకు అంగీకరించలేదని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 27 రాత్రి వేలుసామిపురం వద్ద భారీ జనసమూహం ఉంటుందని అంచనా వస్తూ టీవీకే నుంచి లేఖ అందిందని విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి వెల్లడించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని విజయ్ మాట్లాడుతున్న సమయంలో కొంతసేపు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని కోరినట్లు చెప్పారు. టీవీకే పార్టీ అభ్యర్థనను తాము తిరస్కరించామని ఆమె స్పష్టం చేశారు. మరోపక్క ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. తొక్కిసలాట జరిగిన వేదిక వద్ద కరెంట్ కోత లేదని స్పష్టంచేసింది. ఆ పార్టీ ఏర్పాటు చేసిన జనరేటర్లలో సమస్య కారణంగా కొన్ని లైట్లు మసకబారాయని జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారని పేర్కొంది.


