కాకతీయ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్లోని దంతెవాడ ప్రాంతంలో భద్రతా బలగాలకు భారీ విజయంగా, 71 మంది నక్సలైట్లు భయంతో లొంగిపోయారు. ఈ 71 మంది నక్సలైట్లలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ వద్ద వీరు లొంగిపోయారు. వీరిలో 30 మందిపై రూ. 64లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడం, ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. మావోయిస్టుల ఏరివేతను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేస్తుండటంతో లొంగిపోవడం తప్ప వారికి మరో మార్గం లేదన్నారు.
వీరంతా గతంలో అనేక విధ్వంసక ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు బస్తర్ ఐజీ వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని స్థానిక అధికారులు తెలిపారు. మావోయిస్టులు హింసాయుత విధానాలు వదిలివేసేలా చేయడమే తమ ఉద్దేశ్యమని జనజీవన స్రవంతిలో కలిసే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టుల వైపు భారీగా నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిపారు.


