- గ్రాస్ లాభాలపై బోనస్ ప్రకటించాలి
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కాకతీయ, తెలంగాణ బ్యూరో, శ్రీరాంపూర్ : సింగరేణి గ్రాస్ లాభాలపై బోనస్ ప్రకటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో సింగరేణి కార్మికులు, మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… సింగరేణి విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వల్ల ఒక్కో కార్మికుడికి లక్ష నష్టం వాటిల్లుతోందని, సింగరేణిని నష్టాల బాట పట్టించి దివాళా తీయించే కుట్ర జరుగుతోందన్నారు. సంస్థకు ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 42 వేల కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి అంటే తనకు ప్రాణమని, తెలంగాణ రాకముందు నుంచి సంస్థ కార్మికుల కోసం పోరాడుతున్నానని అన్నారు. మనకు కరువులో అన్నం పెట్టింది సింగరేణి అని, ఆంధ్ర పాలనలో ఉద్యోగాలంటే సింగరేణి ద్వారా వచ్చినవే అన్నారు.
తెలంగాణ వచ్చాక డిపెండెంట్ ఉద్యోగాలను మళ్లీ సాధించుకున్నామని అన్నారు. సింగరేణిలో కొత్తగా గనులను తెరవాల్సి ఉన్నప్పటికీ వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, కానీ కర్ణాటకలో ఒక గని, మరోచోట రాగి గనిని తీసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అవినీతి తగ్గించుకుంటే అన్ని పనులు చేసే అవకాశం ఉంటుందన్నారు. కార్మికులకు లాభాల్లో వాటా అంటూ సీఎం బిచ్చం వేశారని, లాభాల్లో అభివృద్ది పనుల వాటా తీసేసి మిగిలిన దానిలో వాటా ఇవ్వటమేంటని ప్రశ్నించారు. మొత్తం గ్రాస్ లాభాల మీద కార్మికులకు బోనస్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.
సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ నాయకులే గెలిచారని, కార్మికులకు మంచి చేయకపోగా…రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇలాగే చేస్తే కాంగ్రెస్ మళ్లీ గెలవదన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ కు కచ్చితంగా బుద్ది చెబుతారని ఆమె హెచ్చరించారు. తన ఒక్కరి కోసం ఏ నిర్ణయం తీసుకోనని, అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కవిత స్పష్టంచేశారు.


