కాకతీయ, వరంగల్ బ్యూరో: మారుమూల తండా నుంచి మలేషియాకు వెళ్తున్న గుగులోతు అశోక్ కుమార్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి అజీజ్ ఖాన్ అన్నారు. శనివారం హనుమకొండ జేఎన్ఎస్ లో జిల్లా క్రీడా అధికారి గుగులోతు అశోక్ కుమార్ మలేషియాలో జరిగే అంతర్జాతీయ సెమినార్ కు వెళుతున్న సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అజీజ్ ఖాన్ హాజరై మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మారుమూల తండ రతి రాం తండా జన్మించిన అశోక్ కుమార్ రెజ్లింగ్ క్రీడ కోచ్ గా అంతర్జాతీయ స్థాయికి ఎదగారని గుర్తు చేశారు. అలాగే క్రీడలో అత్యున్న స్థాయి వరంగల్ నిట్ నుంచి ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ దగ్గర పీహెచ్ డీ చేయడం అభినందనీయమన్నారు.
ఈ క్రమంలోనే మలేషియాలో జరిగే అంతర్జాతీయ సెమినార్ కు వెళ్తున్నారని చెప్పారు. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలో క్రీడా స్టేడియాలు అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. ఎంత ఎత్తు ఎదిగితే అంత ఒదిగి ఉండే గుణం అశోక్ కుమార్ దని హర్షం వ్యక్తం చేశారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ హనుమకొండ డివైఎస్ఓ అశోక్ కుమార్ అంతర్జాతీయ సెమినార్ కు వెళ్లడం ఆనందదాయకమన్నారు.

అశోక్ సారథ్యంలో జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో దూసుకుపోతున్నారని అభినందించారు. రెజ్లింగ్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ అశోక్ కుమార్ రెజ్లింగ్ క్రీడా వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన ఎక్కడ పని చేసిన ఆ జిల్లా రెజ్లింగ్ లో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దారని అభినందించారు.
అనంతరం వివిధ క్రీడా సంఘాలు, కోచ్ లు అశోక్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నెట్ బాల్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి లిల్లీ ఫ్రాన్సిస్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ రాజలింగం, వివిధ క్రీడా అసోసియేషన్ల సభ్యులు, కోచ్ లు, సిబ్బంది పాల్గొన్నారు.


