కాకతీయ, కరీంనగర్: మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హాల్లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు.
పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో డ్రగ్స్ మూలాలను పెకిలించి వేయాలని పేర్కొన్నారు. ప్రైవేట్ మెడికల్ స్టోర్స్ లోనూ ముమ్మరంగా తనిఖీలు చేపట్టి డ్రగ్స్ అమ్మకాలను పరిశీలించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలను సందర్శించి కేవలం డ్రగ్స్ పైనే కాకుండా మద్యపానం, ధూమపానం అనర్థాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ పోలీసు శాఖ తరఫున విద్యార్థులకు మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామని, డాగ్ స్క్వాడ్ ద్వారా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే డ్రగ్స్ డిడక్షన్ కిట్లు తెప్పించామని, అవసరానికి అనుగుణంగా మరిన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. జిల్లాలో డ్రగ్స్ వినియోగం పై ఉక్కు పాదం మోపుతామని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేశ్వర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


