కాకతీయ, హనుమకొండ : ఈ నెల 14వ తేదీన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సిడిఎస్) పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు.
జిల్లాలో హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సిడిఎస్ పరీక్ష, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిలి మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్డీఏ పరీక్ష జరగనుంది. ఎన్డీఏ పరీక్ష సమయాలు.. ఉదయం 10:00 – మధ్యాహ్నం 12:30 (మొదటి సెషన్), మధ్యాహ్నం 2:00 – సాయంత్రం 4:30 (రెండో సెషన్), సిడిఎస్ పరీక్ష సమయాలు.. ఉదయం 9:00 – 11:00 (మొదటి సెషన్), మధ్యాహ్నం 12:30 – 2:30 (రెండో సెషన్), సాయంత్రం 4:00 – 6:00 (మూడో సెషన్) పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తలిపారు.
సిడిఎస్కు 207 మంది, ఎన్డీఏకు 410 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, వైద్య సిబ్బంది, నిరంతర విద్యుత్ సరఫరా, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయబడుతుంది.
సమావేశంలో ఏసీపీ నరసింహారావు, టీజీ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్, డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, పరిశ్రమల శాఖ జీఎం నవీన్ కుమార్, పోస్టల్ అధికారి శ్రీనివాస్, పింగిలి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రమౌళి, పరీక్షా కేంద్రాల సూపర్వైజర్లు, రూట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.


