కాకతీయ, నేషనల్ డెస్క్: నేపాల్ లో జెన్ -జెడ్ ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలను ఆసరాగా చేసుకుని జైళ్ల నుంచి ఖైదీలు పరారవుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రామోచాప్ జైలు నుంచి పారిపోతున్న కొందరు ఖైదీలపై ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో దేశంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకున్నాయి.
గురువారం జైలు గేటు తాళాలను పగలగొట్టి ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్యామ్ క్రిష్ణ థామా పేర్కొన్నారు. వారిని అడ్డగించేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిగియన్నారు. ఈ కాల్పుల్లో డజను మందికి పైగా ఖైదీలు గాయపడ్డారని తెలిపారు. వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. అయితే కాట్మాండూ, పోఖరా, లలిత్ పుర్ లోని జైళ్ల నుంచి ఇప్పటికే వందలాది మంది ఖైదీలు తప్పించుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
మొత్తం 7వేల మంది ఖైదీలు పరారైనట్లు తెలుస్తోంది. ఇక జైలు నుంచి పారిపోయి వస్తున్న నేపాలీ ఖైదీలను భారత సాయుధ పోలీసుదళం సశస్త్ర సీమా బల్ పట్టుకుంది. యూపీలోని సిద్దార్థనగర్ సమీపంలో 22 మంది నేపాలీ ఖైదీలను అడ్డుకున్నట్లు ఎస్ఎస్ బీ అధికారులు తెలిపారు. నేపాల్ లో ఆందోళన నేపథ్యలో సరిహద్దులో ఎస్ఎస్ బీనే భద్రతను పర్యవేక్షిస్తుంది.
దేశంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాకాలు జరుగుతున్నాయని కాట్మాండూ మేయర్ బాలెన్ షా విజ్నప్తి చేశారు. గురువారం నిరసనకారులను ఉద్దేశిస్తూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. దయచేసి ఓపిక పట్టండి. దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికలు కూడా జరుగుతాయి అంటూ రాసుకొచ్చారు.
సోషల్ మీడియాలపై నిషేధంతో ప్రారంభమైన జెడ్ జెడ్ ఉద్యమం..అవినీత వ్యతిరేక ఉద్యమంగా మారి హింసాత్మక ఘటనకు దారి తీసింది. కాట్మాండూతో సహా పలు నగరాలతో పెద్దెత్తున ఘర్షణలు జరగడంతో ఆర్మీ కర్ఫ్యూ విధించింది. ఈ ఆందోళనల్లో ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 600 మందికిపైగా గాయపడ్డారు.


