కాకతీయ, తెలంగా బ్యూరో: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి వెనుకంజ వేయబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ, ప్రతి ప్రజలకీ తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందని గుర్తు చేశారు.
దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణలో చరిత్రాత్మక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం నుండి సన్నబియ్యం పంపిణీ వరకు అనేక పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని చెప్పారు. రాహుల్ గాంధీ ఆశయాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కుల సర్వేను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. కామారెడ్డి లో జరిగే భారీ బహిరంగ సభలో లక్షల మంది పాల్గొని కాంగ్రెస్ శక్తిని చాటుతారని అన్నారు.
ఇక రాహుల్ గాంధీ గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఓటు చోరీలపై దేశవ్యాప్తంగా పోరాడుతున్నారని తెలిపారు. మోదీ, అమిత్ షా పదవే పరమావధిగా భావించి ఓటు దోపిడీకి పాల్పడతారని, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో దానికి ఉదాహరణ ఉందని అన్నారు. నైతిక విలువలు లేని ఈ చర్యలను రాహుల్ గాంధీ ఎప్పటికీ సహించరని స్పష్టం చేశారు. ఓటు చోరీల వల్లే మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
ఉద్యోగాల విషయమై బీజేపీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. వాస్తవానికి ఉద్యోగాల కల్పన పరిస్థితి దయనీయంగా ఉందని, ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయని మండిపడ్డారు. ఎన్నికలు సమీపించగానే బీజేపీ నాయకులు దేవుళ్ల పేర్లు చెప్పి ప్రజలను మభ్యపెడతారని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా దేవుళ్ల పేర్లు వాడి గెలిచారని, కానీ దేవుళ్లకు బీజేపీ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని గట్టి విమర్శలు చేశారు.
2029 ఎన్నికల్లో మోదీకి పరాభవం తప్పదని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ, వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని అన్నారు. కవిత స్టేట్మెంట్తో కేసీఆర్ కుటుంబం దోపిడీ బట్టబయలైందని, కేసీఆర్ కుటుంబం దొంగల ముఠాగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్లలో డీజిల్ పోసుకోలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం అవినీతి సొమ్ముతో వందల కోట్లకు పడగలెత్తిందని ఎద్దేవా చేశారు.
సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పారు. ప్రజలతో ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నామని, మీనాక్షి గాంధీ నిజాయితీకి నిలువెత్తు రూపమని కొనియాడారు.


