కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం తెలిపారు. గణేష్ శోభాయాత్ర , నిమజ్జనం కోసం దాదాపు 867 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, ఏన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లను విధుల్లో నియమించినట్లు ఆయన తెలిపారు.
బందోబస్తులో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 20 మంది ఇన్స్పెక్టర్లు, 40 మంది ఎస్ఐలు, 350 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, 100 మంది హోంగార్డులు, 150 మంది ఏన్సీసీ క్యాడెట్లు, 200 మంది వాలంటీర్లు పాల్గొంటున్నట్లు పోలిస్ కమిషనర్ తెలిపారు. అస్త్ర కన్వెన్షన్ హాలులో పోలీసు అధికారులకు నిర్వహించిన బ్రీఫింగ్లో సీపీ పలు సూచనలు చేశారు.
నిమజ్జనం పూర్తయ్యే వరకు విధులు కేటాయించిన సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో పటిష్ట భద్రతతో పాటు, రూఫ్టాప్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. నిఘా కోసం ఇప్పటికే మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసిన 750 కెమెరాలతో పాటు, పోలీస్ శాఖ అదనంగా 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిందని, ఈ కెమెరాల దృశ్యాలను నిరంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి, నిమజ్జన ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ ఈతగాళ్లను, లైఫ్ జాకెట్స్, లైఫ్ బోయ్స్, మొబైల్ బైక్లతో సిద్ధంగా ఉందని, వైద్య అధికారులు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి అంబులెన్స్లను అందుబాటులో ఉంచారన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది కూడా మార్గమధ్యంలో అందుబాటులో ఉంటారని సీపీ తెలిపారు. అన్ని శాఖల అధికారులు (విద్యుత్, వైద్య, అగ్నిమాపక, మున్సిపల్) సమన్వయంతో పనిచేయాలని సీపీ సూచించారు.


