కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఏపీకి చెందని ఓ సీనియర్ అధికారిపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ లో తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ మరణానికి అతనే కారణమయ్యారని..తన పలుకుబడిని ఉపయోగించి ఈ విషయాన్ని బయటకు రాకుండా తొక్కిపెట్టారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
పలు వార్త పత్రికల్లో ప్రచురీతమైన కథనాల ప్రకారం..ఏపీ కేడర్ కు చెందిన సదరు అధికారి గతంలో ఓ సీఎం కార్యాలయంలోనూ, వైఎస్ జగన్ హయాంలోనూ ఓ కీలక శాఖకు అధిపతిగాను పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తరచూ హైదరాబాద్ లోనే గడుపుతూ..తన కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేశారని తెలుస్తోంది.
ఈమధ్య అనారోగ్యానికి గురైన ఆ అధికారి తాను చికిత్స పొందుతున్న సమయంలో ఆ మహిళ వేరొకరితో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానించారు. ఈ అనుమానమే వారి మధ్య గొడవకు దారితీసింది. గత శుక్రవారం వీరిద్దరి మధ్య మాటమాటా పెరిగింది. దీంతో ఘర్షణకు దారి తీసింది. ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోయిన ఆ అధికారి ఆమెను బలంగా కొట్టాడు. ఆమె తల గోడకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే ఆమెను సమీపంలో ఓ ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ మరణానికి అసలు కారణాన్ని దాచిపెట్టి ప్రమాదవశాత్తు కిందపడిపోవడం వల్ల గాయమైందని ఆసుపత్రి రికార్డుల్లో నమోదు చేయించినట్లు తెలుస్తోంది. తనకున్న అధికార పలుకుబడిని అడ్డంగా పెట్టుకుని ఈ విషయం పోలీసుల వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.
ఈ దారణం తర్వాత ఏమీ ఎరగనట్లు విజయవాడకు తిరిగి వచ్చి తన విధుల్లో నిమగ్నమయ్యారు. అయితే హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన గురించి ఆయన సన్నిహితులకు, కొందరు ఐఏఎస్ వర్గాలకు ఇప్పటికే తెలిసినట్లు ప్రచారం జరుగుతోంది.


