కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్లను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డిని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని చేర్చారని, దాన్ని ప్రకారం గెస్ట్ లెక్చరర్లకు న్యాయం చేయాలని కోరారు.
రెన్యూవల్ మరియు రెగ్యూలర్ లెక్చరర్ల నియామకం వల్ల డిస్టర్బ్ అయిన వారిని అడ్జస్ట్ మెంట్ చేయడానికి సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటర్ బోర్డు కార్యదర్శి పోస్టుల తగ్గింపునకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. 13-06-25 న ప్రభుత్వ ఆమోదం కోసం పంపిన 1654 గెస్ట్ ఫ్యాకల్టీ కంటిన్యూయేషన్ ఫైల్ లో ఫైనాన్స్ అధికారులు వివిధ కారణాలు చూపి పోస్టుల సంఖ్య తగ్గింపు చేస్తున్నారని, కేవలం 398 పోస్టులకు మాత్రమే జీవో ఇస్తున్నారని అన్నారు.
అదే జరిగితే దాదాపు 1300 మంది కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై 398 పోస్టులతో కళాశాలల నిర్వాహణ కష్టమవుతుందని తేది: 21/08/2025 నాడు బోర్డ్ సెక్రటరీ అదనంగా 1256 పోస్టులకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి మళ్ళీ ప్రతిపాదనలను పంపడం జరిగిందన్నారు. దానిపై ఫైనాన్స్ అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. 1654 పోస్టులలో సంఖ్య తగ్గిస్తే దాదాపు 1300 మంది రోడ్డున పడుతున్నారని కేవలం 398 పోస్టులతో అనుమతివ్వకుండా మొత్తం 1654 (398+1256) పోస్టులకు అనుమతివ్వాలని వేం నరేందర్రెడ్డిని కోరారు.
గత సంవత్సరానికి సంబంధించిన 4 నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కోడి మహేష్ కుమార్, ఎం.బాబురావు, సంయుక్త కార్యదర్శులు కె. వెంకటేష్, రాంచందర్ లు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉండగా ప్రతినిధుల వినతిపై వేం స్పందిస్తూ ఈ విషయాన్ని సీఎం మరియు డిప్యూటీ సీఎం ల దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


