కాకతీయ, కరీంనగర్: హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి నిర్మాణం వేగవంతం కోసం అవసరమైన చర్యలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు వరుసల రహదారి కోసం ఇప్పటికే మార్కింగ్ పూర్తవడంతో ఎలక్ట్రికల్ వర్క్స్, బావుల పూడ్చివేత, చెట్లు కత్తిరించడం వంటి పనులు వేగవంతం చేయాలని అన్నారు.
ఇప్పుడున్న రహదారిని వెడల్పు చేస్తుండడంతో గ్రామాల గుండా వెళ్తున్న రహదారి నిర్మాణం కోసం గ్రామసభలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలన్నారు. అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించడం, కొత్త లైన్ ఏర్పాటు చేయడం వంటి పనులను వేగవంతం చేయాలని, హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు నిర్మించనున్న రోడ్డు కోసం కరీంనగర్ జిల్లా పరిధిలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, జంగపల్లి తదితర గ్రామాల పరిధిలో రోడ్డును ఆనుకొని ఉన్న బావులను పూడ్చివేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, జిల్లా అటవీ శాఖ అధికారి బాలామణి, ఆర్అండ్ బి ఈఈ నరసింహచారి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


