చౌక ధరల దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
సన్న బియ్యం పంపిణీపై పరిశీలన
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ సక్రమంగా జరుగుతున్నదీ లేదో పరిశీలించినట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్ చౌక ధరల దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాల నమోదు, బియ్యం పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అమలు పరిస్థితిని సమీక్షించారు. పలువురు రేషన్ కార్డు లబ్ధిదారులతో మాట్లాడి ఇప్పటివరకు ఎంతమంది బియ్యం తీసుకువెళ్లారో తెలుసుకున్నారు. పంపిణీలో సమస్యలు ఉన్నాయా అని రేషన్ డీలర్ను ఆరా తీశారు. ఈ పరిశీలనలో డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


