యోగా మన జీవన విధానం
యోగాతో శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యత
ప్రపంచానికి భారత్ అందించిన వరం
ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తాం
ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
ఆరోగ్యంగా ఉండడం ఆప్షన్ కాదు.. ఆవశ్యకం
యోగా వేడుకల్లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ
గచ్చిబౌలిలో ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం
ఆసనాలు వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.. అధికారులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మెరుగైన తెలంగాణ కోసం ఆరోగ్య వారోత్సవాలు చేపట్టారు. నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకుని పలుచోట్ల యోగా వేడుకలు నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. కాగా.. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆరోగ్య వారోత్సవాలు ఘనంగా జరిగాయి. యోగా వేడుకల్లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మంత్రి దామోదర పిలుపునిచ్చారు. భారత్ ప్రపంచానికి అందించిన గొప్ప విద్య యోగా అని ఆయన తెలిపారు. దీనిని ప్రోత్సహించేందుకు బీఎన్ వైఎస్ కోర్స్తో పాటు పీజీ కోర్సులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. యోగా, నేచురోపతి, హోమియోపతి వంటి ఆయుష్ విధానాలను బలోపేతం చేసి ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి హెల్త్ సెక్రటరీ క్రిస్టినా సహా పలువురు అధికారులు హాజరయ్యారు. మంత్రులు, అధికారులు యోగ ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు.

ప్రతి ఒక్కరికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు
చికిత్సకంటే నివారణ మంచిదనే లక్ష్యంతో ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నామని మంత్రి దామోదర తెలిపారు. యోగ భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరం అన్నారు. ఇది కేవలం వ్యాయామం కాదు.. సంపూర్ణ జీవన విధానం అన్నారు. యోగ సాధన ద్వారా శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న సెడెంటరీ లైఫ్స్టైల్, ఫుడ్ హాబిట్స్, పొల్యూషన్ కారణంగా షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. యోగ సాధన ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గి జీవన నాణ్యత పెరుగుతుంది. నిత్యం యోగా సాధనతో ఎన్సీడీల భారిన పడకుండా ఉంటారు. మా ప్రభుత్వం చికిత్సతో పాటు, రోగ నివారణకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఉచితంగా రక్తపోటు, షుగర్ వంటి పరీక్షలను నిర్వహిస్తున్నాం. 46 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు సుమారు 30 రకాల పరీక్షలతో కూడిన సమగ్ర ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం. సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం బాలికలు టీకా పంపిణీ చేస్తున్నాం. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించి హెల్త్ కార్డులను అందించే దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు.
కల్తీ, నాసిరకం ఆహారంపై కఠిన చర్యలు
కల్తీ, నాసిరకం ఆహారంపై కఠిన చర్యలు తీసుకుంటూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. పట్టణ ప్రాంతాల్లో మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు 145 పాలీక్లినిక్స్ను ఏర్పాటు చేస్తున్నాం.
బాల భరోసా కార్యక్రమం ద్వారా 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించి, శారీరక, మానసిక లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి.. అవసరమైన చికిత్స అందిస్తున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా ఆరోగ్య సేవలను ఆసుపత్రుల నుంచి నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. యోగ, నేచరోపతి, హోమియోపతి వంటి ఆయుష్ విధానాలను బలోపేతం చేసి ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలను అందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 750 మంది యోగ శిక్షకులను నియమించి రోజువారీ యోగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా ఇప్పటికే దాదాపు కొత్తగా 10 లక్షల మందికి యోగాను పరిచయం చేయగలిగాం. యోగ విద్యను ప్రోత్సహించేందుకు BNYS కోర్సుతో పాటు పీజీ కోర్సులను కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆరోగ్యంగా ఉండడం ఆప్షన్ కాదు.. ఆవశ్యకం అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం మనమంతా కలిసి ముందుకు సాగుదాం….అని మంత్రి అన్నారు.
ఆరోగ్య తెలంగాణను ప్రోత్సహించేందుకే..
ములుగు జిల్లాలో ఉన్న గిరిజన భవన్లో ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క తనకు సమయం దొరికినప్పుడల్లా యోగా చేస్తుంటానని తెలిపారు. ఆరోగ్య తెలంగాణను ప్రోత్సహించేందుకే పట్టణంలో పలుచోట్ల ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో ఆయుష్ తెలంగాణగా వెలుగొందాలంటే ప్రజలు తమ దినచర్యలో యోగాను భాగంగా చేసుకోవాలని మంత్రి సీతక్క కోరారు. ములుగు జిల్లాను ఆరోగ్యకరంగా మార్చేందుకు యోగా ఎంతో కీలకమని చెప్పారు.


