మొక్కజొన్న కొనుగోళ్లకు షరతులు పెట్టొద్దు
ఫంగస్ పేరుతో రైతులను వేధించడం దారుణం
మార్క్ఫెడ్ అధికారుల తీరుపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి ధ్వజం
కాకతీయ,ఖమ్మం : మొక్కజొన్న కొనుగోళ్లలో ఎటువంటి షరతులు పెట్టకుండా ప్రతి గింజను సేకరించాలని, ఫంగస్ పేరుతో రైతులను వేధించడం దారుణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. గురువారం జిల్లాలోని కొనిజర్ల, వైరా మండలాల్లో మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని స్పందిస్తూ ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి పెరిగి దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చినా మార్కెట్లో సరైన మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో క్వింటాల్ మొక్కజొన్న ధర 1700 నుండి 1800 వరకు మాత్రమే పలుకుతోందని, ఇది రైతులకు కనీస పెట్టుబడి కూడా రాని పరిస్థితి తీసుకువస్తోందని పేర్కొన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని మార్కెట్కు తీసుకువస్తే మార్క్ఫెడ్ అధికారులు ఫంగస్, సన్నాల పేరుతో కొర్రీలు పెడుతూ కొనుగోళ్లు నిలిపివేయడం దారుణమని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పంట నాణ్యత బాగున్నప్పటికీ అధికారులు కావాలనే కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ చైర్మన్ జోక్యం చేసుకుని రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని కోరారు.
వర్షాల కారణంగా రైతుల ఆందోళన
అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా కల్లాల్లో ఉన్న మక్కలు తడిసి నష్టపోతున్నాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యం జరగడంతో రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్షానికి తడిసిన గింజలను దళారులు కొనరని, ఒకవేళ కొన్నా చాలా తక్కువ ధరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మార్క్ఫెడ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తడిసిన పంటను కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మందడపు సుబ్బారావు, బండారు నరేష్, కావిడ మురళీకృష్ణ, యాస సత్యనారాయణ, కవిడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


