ముల్కనూర్ స్టేషన్ను తనిఖీ చేసిన సీపీ
కాకతీయ, హన్మకొండ : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ముల్కనూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్లోని అధికారులు, సిబ్బందితో సమావేశమై పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన పెంచాలని, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అర్రైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. స్టేషన్ రికార్డులను పరిశీలించిన సీపీ గ్రామాల హిస్టరీ షీట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది తరచుగా గ్రామాల పర్యటనలు నిర్వహించి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఎల్కతుర్తి సిఐ పులి రమేష్, ఎస్ఐ రాజు తదితరులు పాల్గొన్నారు.


