బల్దియాలో భారీ అవినీతి
మున్సిపల్లో ప్రతీ పనికి బేరసారాలు
అక్యూపేషన్ సర్టిఫికెట్ల పేరుతో భారీ వసూళ్లు
పన్నులు, అడ్వర్టైజ్మెంట్ ఫీజుల వసూళ్లలో లోపాలు
ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్నారు
చింతకుంట సర్వే నంబర్ 439లో ఉన్న రెండు ఎకరాలు అన్యాక్రాంతం
ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు
మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు
కాకతీయ, కరీంనగర్ : నగర మున్సిపల్ కార్పొరేషన్లో భారీగా అవినీతి పెరిగిపోయిందని కరీంనగర్ మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.బుధవారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల ఏసీబీ సోదాల్లో వెలుగులోకి వచ్చిన అవినీతి మాదిరిగానే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోనూ భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా పన్నులు, అడ్వర్టైజ్మెంట్ ఫీజుల వసూళ్లలో లోపాలు ఉన్నాయని తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిందని విమర్శించారు. బదిలీపై వచ్చే అధికారులు ‘గోన సంచులు’ తెచ్చుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు ఇబ్బందులు పెడుతూ, పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వ భూములపై రియల్ ఎస్టేట్ దందా
నగరంలో విలీనమైన గ్రామాల్లో కొత్తగా అక్రమాల దందా ప్రారంభమైందని ఆరోపించారు. చింతకుంట ప్రాంతంలోని సర్వే నంబర్ 439లో ఉన్న రెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి బహిరంగంగా అమ్ముతున్నారని తెలిపారు. ఇదే తరహాలో అల్గునూరు ప్రాంతంలోనూ ప్రభుత్వ, సాగుభూములను అక్రమంగా ప్లాట్లుగా మార్చి కాంపౌండ్ గోడలు కట్టి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారాలన్నింటికీ టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారం ఉందని ఆరోపించారు.
ఓ సి సర్టిఫికెట్ల పేరుతో భారీ వసూళ్లు
అపార్ట్మెంట్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినా, ఒక్కో ఆక్యుపేషన్ సర్టిఫికెట్ కోసం రూ.13 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. రెండుసార్లు తిరస్కరించిన ఫైల్, డబ్బులు ఇచ్చిన తర్వాత ఎలా ఆమోదం పొందుతుందో ప్రశ్నించారు.మున్సిపల్ బడ్జెట్ కంటే అవినీతి ఆదాయం ఎక్కువగా ఉందని విమర్శించారు. ఇటీవల కమిషనర్ లేకుండానే కేంద్ర మంత్రి బండి సంజయ్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం కావడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం అవినీతి అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ లేఅవుట్లు, భూముల మార్పిడి వ్యవహారాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పందించాలని కోరారు. నగరంలో ఒక్క ఇంచ్ ప్రభుత్వ భూమి అక్రమానికి గురైనా ఊరుకోమని, బీఆర్ఎస్ తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


