కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ఘోరం జరిగింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఓ బైక్ రైడర్ మరణించాడు. నాచారం కార్తికేయ నగర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సాత్విక్ తన బైక్ పై ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. రహదారి డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగి ఆయనపై పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.
ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఇలాంటి పాత దెబ్బతిన్న స్తంభాలు మార్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంపై ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమంటూ ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాత్విక్ మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


