కాకతీయ ఎఫెక్ట్..!
మారీచులపై టీజీఎండీసీ ఎండీ స్పందన
బ్రాహ్మణపల్లి క్వారీ-2 అక్రమాలపై ఎంక్వయిరీకి భవేశ్మిశ్రా ఆదేశం
లోడింగ్ చార్జీలు వసూళ్లపై విచారణ చేపట్టాలని పీవో రామకృష్ణకు బాధ్యతలు
లారీ డ్రైవర్ ప్రవీణ్ దాడి చేయడంపైనా నివేదిక కోరిన ఐఏఎస్
ఆరోపణలు నిజమైతే.. క్వారీని సీజ్ చేయాలని ఆదేశాలు
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోని మహదేవ్పూర్ పోలీసులు
వీడియోలు..ఆధారాలు సమర్పించినా కేసు నమోదులో జాప్యం
క్వారీ ఓనర్ విజేందర్రెడ్డికి సహకరిస్తున్నారా..?
ఆరోపణలు ఎదుర్కొంటున్న పీవోతో విచారణ సాధ్యమేనా..!?
లారీ డ్రైవర్లకు, ఓనర్లకు న్యాయం జరుగుతుందా..? వేధింపులు ఆగుతాయా..?
అన్ని సందేహాలే.. మమ అనిపించడమే లక్ష్యమా..
మహదేవ్పూర్ బ్రాహ్మణపల్లి క్వారీ-2 ఘటనలో కలుగుతున్న అనుమానాలు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం బ్రాహ్మణపల్లి క్వారీ-2లో వెలుగుచూసిన అక్రమాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. కాకతీయలో మారీచులు అనేక కథనం సోమవారం పతాక శీర్షికన ప్రచురితం కావడంతో టీజీఎండీసీ ఎండి భవేశ్మిశ్రా స్పందించారు. మహదేవ్పూర్ మండలం బ్రాహ్మణపల్లి క్వారీ-2లో ప్రవీణ్ అనే డ్రైవర్పై ముగ్గురు క్వారీ సిబ్బంది దాడి చేసిన అంశంతో పాటు క్వారీలో లోడింగ్ పేరుతో 1700 వసూలు చేయడంపైనా ఎంక్వయిరీ చేయాలంటూ పీవో రామకృష్ణను ఎండీ భవేశ్ మిశ్రా ఫోన్లో ఆదేశించారు. ఈమేరకు ఇదే విషయంపై ప్రాజెక్టు ఆఫీసర్ రామకృష్ణను కాకతీయ సంప్రదించగా.. ఎంక్వయిరీకి ఆదేశించిన మాట వాస్తవమేనని తెలిపారు. దాడి ఘటన, వసూళ్లపై ఎండి ఎంక్వయిరీకి ఆదేశించినట్లుగా ధ్రువీకరించారు.

ప్రభుత్వ వర్గాల్లో, మైనింగ్ డిపార్ట్మెంట్లో చర్చ..
కాకతీయలో ప్రచురితమైన మారీచులు కథనం ప్రభుత్వ వర్గాల్లో, మైనింగ్ డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్న వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. దీనికితో లారీ అసోసియేషన్ నాయకులు కూడా కాకతీయలో ప్రచురితమైన కథనాలను ఆధారంగా చూపుతూ.. ఎండీ భవేశ్మిశ్రా దృష్టికి తీసుకెళ్లారు. ఈ కథనాలు, లారీ అసోసియేషన్ చూపిన వీడియో, ఇతర ఆధారాలను పరిశీలించిన టీజీఎండీసీ ఎండీ విచారణకు ఆదేశించారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న ఇసుక క్వారీల్లో లోడింగ్ పేరుతో డ్రైవర్లు, యజమానుల నుంచి తీసుకుంటున్న అదనపు చార్జీలను వెంటనే నియంత్రించాలని ఎండీ అధికారులను ఆదేశించడం గమనార్హం.
అక్రమాలు తేలితే.. సీజ్ చేయండి..!
బ్రాహ్మణపల్లి క్వారీ-2లో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయి నివేదిక కోరిన టీజీఎండీసీ ఎండీ భవేశ్ మిశ్రా.. అక్రమాలు జరిగినట్లుగా తేలితే క్వారీని సీజ్ చేయాలని అధికారులకు ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంట్రాక్టర్ అక్రమాలను పొత్సహించవద్దని, లారీ ఓనర్ల, డ్రైవర్లను వేధించడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ క్షేత్రస్థాయి అధికారులను మందలించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో లోడింగ్ బిల్లుల చెల్లింపుల్లో కొంత ఆలస్యం జరుగుతుండటంతోనే క్వారీ కాంట్రాక్టర్ల ఆగడాలు ఎక్కువువుతున్నాయని, దీన్ని అరికట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. క్వారీలో జరుగుతున్న లోడింగ్ ఛార్జీల వసూళ్లు, లారీ డ్రైవర్లపై వేధింపులు, ఇటీవల చోటుచేసుకున్న దాడి ఘటనల నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు బ్రాహ్మణపల్లి క్వారీ-2 ఘటనపై విచారణ చేపట్టాలని ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీవో) రామకృష్ణకు బాధ్యతలు అప్పగించారు.
విచారణ మమ అనిపిస్తారా..? నిజాలు నిజంగా తేలుస్తారా.?
ఈ మొత్తం వ్యవహారంలో మహదేవ్పూర్ పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వీడియోలు, ఇతర ఆధారాలు సమర్పించినప్పటికీ కేసు నమోదు చేయడంలో జాప్యం ఎందుకు జరిగిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. క్వారీ యాజమాన్యానికి పోలీసులు మద్దతుగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా క్వారీ ఓనర్ విజేందర్రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా విచారణ బాధ్యతలను అప్పగించిన పీవో రామకృష్ణపై కూడా కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఆయన ఆధ్వర్యంలో జరిగే ఎంక్వయిరీ ఎంతవరకు నిష్పక్షపాతంగా ఉంటుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారినే విచారణ బాధ్యతల్లో పెట్టడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ఘటనలతో లారీ డ్రైవర్లు, ఓనర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోజువారీ ఉపాధి కోసం కష్టపడుతున్న తమపై అధిక వసూళ్లు, బెదిరింపులు, దాడులు కొనసాగుతున్నాయని వారు వాపోతున్నారు. తక్షణమే ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం టీజీఎండీసీ ఎండీ ఆదేశాలతో విచారణ ప్రారంభం కానుండగా, నిజాలు వెలుగులోకి వస్తాయా..? బాధ్యులపై చర్యలు తీసుకుంటారా..? లేక వ్యవహారం ‘మమ’ అనిపించడమే లక్ష్యమా..? అన్న అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ కేసు తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.


