అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు
శంకుస్థాపన జరిగి రెండేళ్లైనా పనులు లేవు
బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు
తూర్పు కోట రోడ్డు దుస్థితిపై ఆగ్రహం
కాకతీయ, ఖిలా వరంగల్ : అర కిలోమీటర్ రోడ్డులోనే అరవైకి పైగా గుంతలు ఉండటంతో ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టుకుని ప్రయాణిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు మండిపడ్డారు. రహదారి దుస్థితిని వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఖిలా వరంగల్ తూర్పు కోట ప్రాంతంలో బీజేపీ నాయకులు, స్థానికులతో కలిసి నిరసన చేపట్టారు. హనుమాన్ గుడి జంక్షన్ నుంచి కోట వరకు రహదారిని పరిశీలించారు. గుంతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు, వృద్ధులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వర్షం పడితే గుంతలు నీటితో నిండిపోతాయని తెలిపారు. ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని హెచ్చరించారు. ప్రజలు భయంతో ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రహదారికి రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని అన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా గుంతలపై పూలు జల్లుతూ బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కందిమల్ల మహేష్, నాండ్రే అమర్, బోలుగొడ్డు సతీష్, బిల్లా కిషోర్, రఘునాథ్, రమేష్, రంజిత్, అమృత్, మురళి చిరంజీవి, హస్తిక్ తదితరులు పాల్గొన్నారు.


