అతిపెద్ద రాజకీయ శక్తిగా బీజేపీ
కార్యకర్తల నిస్వార్థ త్యాగమే పార్టీ బలగం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం : కార్యకర్తల నిస్వార్థ త్యాగం, అంకితభావం వల్లే బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. పార్టీ బలగం కార్యకర్తలేనని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్, సీనియర్ నాయకులు గంట్యాల విద్యాసాగర్, వక్కలంక సుబ్రహ్మణ్యం, మండడపు సుబ్బారావు, అల్లిక అంజయ్య, నకరికంటి వీరభద్రం, లక్ష్మీనారాయణ, రవి గౌడ్, వీరభద్ర ప్రసాద్, ఆర్ వి ఎస్ యాదవ్, దార్ల మల్లేశ్వరి, మణి, వెంకటనారాయణ, రుద్రగాని మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆవిర్భావ వేడుకలు వైభవంగా
జిల్లా కేంద్రంతో పాటు రోటరీ నగర్, ఖానాపురం, గట్టయ్య సెంటర్, రాపర్తి నగర్, కాల్వొడ్డు, కొనిజర్ల మండలం అనంతారం గ్రామాలలో పార్టీ జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ కోట్లాది కార్యకర్తల త్యాగం వల్లే పార్టీ ఈ స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి వేసిన పునాదులపై పార్టీ బలోపేతంగా ముందుకు సాగుతోందని తెలిపారు. సామాన్య కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్న పార్టీ బీజేపీ అని వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.


