విద్యార్థుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి
బెస్ట్ అవైలబుల్ పథకం నిధులు ఆలస్యం
కాకతీయ, ఖమ్మం : బెస్ట్ అవైలబుల్ పథకం కింద చదువుతున్న విద్యార్థుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు ఆలస్యమవుతున్నందున పాఠశాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో తల్లిదండ్రులు వినతిపత్రం సమర్పించారు. సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో గత నాలుగు, ఐదు సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాల పిల్లలు ఈ పథకం ద్వారా చదువుతున్నట్లు వివరించారు. అయితే గత ఐదు, ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి రావలసిన డబ్బులు పాఠశాలకు అందలేదని తెలిపారు.
విద్యా సంవత్సరం 2025 2026లో స్కూల్ యాజమాన్యం పరిస్థితుల దృష్ట్యా ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్, షూస్ కోసం తల్లిదండ్రులను అడిగినట్లు చెప్పారు. అప్పట్లో కలెక్టర్ను కలిసి విన్నవించగా అధికారులు త్వరలో బకాయిలను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య మళ్లీ పునరావృతం కాకుండా వెంటనే నిధులు విడుదల చేసి పిల్లల విద్య కొనసాగేందుకు సహకరించాలని కోరారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ డీడీకి కూడా వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తల్లిదండ్రులు పాల్గొన్నారు.


