రేపటి నుంచి ఆరోగ్య వారోత్సవాలు
అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలి
ప్రజల్లో ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పించాలి
వైద్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాలి
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర
కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 6 నుండి 11 వరకు ఆరోగ్య వారోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర ఆదేశించారు. ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో వారం రోజులపాటు ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
వారోత్సవాల షెడ్యూల్ ఖరారు
ఏప్రిల్ 6న ఫుడ్ సేఫ్టీ దినంగా నిర్వహించి ఆహార భద్రత, కల్తీ ఆహారం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అదే రోజు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు “ఈట్ రైట్ వాక్” నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించగా, 8న సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా వర్క్షాప్ నిర్వహించాలని సూచించారు. 9న ఎయిడ్స్ అవగాహన కోసం “రెడ్ రన్ వాక్” నిర్వహించాలన్నారు. 10న హోమియోపతి, ఆయుష్ దినోత్సవం సందర్భంగా యోగా డెమో క్యాంప్ నిర్వహించగా, 11న డ్రగ్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో మందుల వినియోగం, డ్రగ్ దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజల భాగస్వామ్యం కీలకం
వారం రోజులపాటు జరిగే కార్యక్రమాలకు వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను డీఎంహెచ్ఓ వివరించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సి.హెచ్ మహేందర్ జీ, డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్ రావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీఎస్పీ, డీపీఓ వెంకయ్య, డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


