దళారుల దోపిడీ అరికట్టాలి
మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలి
ఎంఎస్పీ ప్రకారం వెంటనే కొనుగోలు చేయాలి
ఏఐకేఎఫ్ రాష్ట్ర కోశాధికారి గుండెబోయిన చంద్రయ్య
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని రామచంద్రాపురం రెవెన్యూ గ్రామంతో పాటు దేవనగరం, సోమల తండా, మామిడి రేవుపల్లి తండా గ్రామాల్లో మొక్కజొన్న రైతుల పరిస్థితిని ఏఐకేఎఫ్ రాష్ట్ర కోశాధికారి గుండెబోయిన చంద్రయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల కల్లాలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులు నాలుగు నెలలు కష్టపడి పంట పండించినప్పటికీ గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2400 ఉన్నప్పటికీ, మార్కెట్లో మధ్యవర్తులు కేవలం రూ.1800కే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మొక్కజొన్న కోతలు ప్రారంభమై 15 రోజులు గడిచినా ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఆలస్యంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తే దళారులే రైతుల పేరుతో లాభాలు పొందే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రతి రెవెన్యూ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, క్వింటాలుకు రూ.2400 మద్దతు ధరకు పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బంది కొరత ఉంటే మార్క్ఫెడ్ లేదా ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి మండల కార్యదర్శి పొర్ల కొమురయ్య, నాయకులు రాసర్ల చంద్రమౌళి, వడ్లూరి వెంకన్న, రైతులు ఆకుల కుమారస్వామి, ఏసవేన లక్ష్మణారి, బానోతు రాములు, ఒజ్జల ఐలయ్య, మొర్రి రాజు, మహిళా రైతులు రాధక్క, ఏషవేనా తదితరులు పాల్గొన్నారు.


