క్యాతన్ పల్లి బీఆర్ఎస్ కైవసం
మున్సిపాలిటీని దక్కించుకున్న బీఆర్ఎస్ సీపీఐ కూటమి
ఎన్నికల్లో కలిసి వచ్చిన పొత్తు
సజావుగా సాగిన చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక
కాంగ్రెస్ కౌన్సిలర్ల గైర్హాజరు.. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య ఆధ్వర్యంలో ఎన్నిక
కాకతీయ, రామకృష్ణాపూర్ : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సీపీఐ కూటమి ఆధిపత్యం స్పష్టమైందని అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించిన క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక శనివారం ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల సంఘం నిర్ణయించిన సమయానికి బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి హాజరయ్యారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరు కావడం గమనార్హంగా మారింది. బీఆర్ఎస్, సీపీఐకి చెందిన 14 మంది సభ్యులు హాజరుకావడంతో కోరం పూర్తై ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ప్రత్యేక అధికారి అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య ఎన్నికను నిర్వహించారు. బీఆర్ఎస్ కు చెందిన 17వ వార్డు అభ్యర్థి గోడిసెల సంధ్యారాణి చైర్ పర్సన్ గా ఎన్నిక కాగా, 22వ వార్డు అభ్యర్థి మిట్టపల్లి సరిత వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.

పోలీసు బందోబస్తుతో ప్రశాంత ఎన్నిక
ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ సీపీ అంబర్ కిషోర్ ఝా స్వయంగా పర్యవేక్షించారు. డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో ఏసీపీలు, సీఐలు, ఎస్ ఐలు సహా సుమారు 650 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఎన్నికల నిర్వహణపై బెల్లంపల్లి సబ్ కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు మనోజ్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సీపీఐ పొత్తు ఫలితమిచ్చిందని స్పష్టమైంది. రెండు సార్లు వాయిదా పడిన ఎన్నికను మూడోసారి విజయవంతంగా నిర్వహించడంలో కూటమి సమన్వయం కీలక పాత్ర పోషించింది. కౌన్సిలర్లను ఏకతాటిపై నిలబెట్టి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ స్థానాలను కైవసం చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.




