మంత్రి మాటకు విలువేది..?!
కలెక్టర్ సార్ ఆదేశాలు అమలెక్కడా?
పట్టణ ప్రకృతిపై జరిగిన విచారణ ఎందుకు బయట పెట్టరు
నివేదిక ఇవ్వడానికి ఆర్డీవోకు సమయం లేదా..?
ఆర్డీవో మౌనం వెనుక అసలు మర్మం ఏమిటి?
విచారణ పేరుతో గోప్యంగా దాచిపెట్టిన నిజాలు
పార్క్ స్థలం కబ్జా బహిరంగ రహస్యం
టౌన్ ప్లానింగ్ ధన ప్లానింగ్గా మారిందా
నోట్ల మూటలే అధికారుల నోరు మూయించాయా
కోట్ల భూమికి సమాధి కట్టినట్టేనా
అన్ని ప్రశ్నలే.. సమాధానాలు చెప్పే వారెవరు..?
అనుమానాలకు తావిస్తున్న ఆర్డీవో మిగతా అధికారుల వైఖరి
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ప్రజలకు ఊపిరితిత్తుల్లా ఉండాల్సిన పట్టణ ప్రకృతి వనం ఇప్పుడు కబ్జాదారుల కడుపు నింపే బంగారు గని అయ్యింది. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కళ్లముందే మాయమవుతుంటే కాపాడాల్సిన అధికార యంత్రాంగం మాత్రం కనీసం కదలకుండా నిలిచిపోవడం ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారుతోంది. కబ్జాను అడ్డుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నుంచి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు అందినా..విచారణ పేరుతో భూ కబ్జాదారులకు అధికారులు సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దాదాపు వారం దాటినా నివేదిక అందించకపోవడమే కాదు.. కనీసం ప్రాథమిక వివరాలు సైతం కాకతీయకు వెల్లడించడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. విచారణపై కాకతీయ ప్రతినిధి పలుమార్లు అధికారులను వివరణ కోరగా పొడిపొడిగా సమాధానాలు చెబుతుండటం.. అసలు విషయం మాత్రం వెల్లడించకపోవడం.. స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.

ఆర్డీవో అదోరకం..
పట్టణ ప్రకృతి వనం భూ కబ్జా అంశాన్ని కాకతీయ దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చిన విషయం పాఠకులకు విదితమే. దాదాపు గత నెలరోజులుగా ఈ అక్షర పోరాటం కొనసాగిస్తోంది. ఫలితంగానే చివరికి మంత్రిని ట్యాగు చేస్తూ వార్త ప్రచురించడంతో మంత్రి తుమ్మల, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పందించారు. ఖమ్మం ఆర్డీవో శ్రీనివాసరావు సారథ్యంలో టౌన్ ప్లానింగ్, ఖమ్మం తహసీల్దార్తో కూడిన బృందంతో విచారణకు ఆదేశించారు. ఆర్డీవో తుది నివేదిక స్పందించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు అధికారి కనీసం పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదని కాకతీయకు స్పష్టమైన సమాచారం ఉంది. అదే సమయంలో నిర్మాణాలను కూడా అడ్డుకోకపోవడం గమనార్హం. ఆర్డీవో సహా ఇతర అధికారులెవ్వరూ.. నోరు మెదపకపోవడం.. వివరణ ఇచ్చేందుకు కూడా ఇష్టపడకపోవడంపై అనుమానాలు పెరుగుతున్నాయి.
మంత్రి తుమ్మల ఆదేశాలనూ పట్టించుకోరా..?!
పట్టణ ప్రకృతి వనంపై విచారణ చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విచారణకు ఆదేశించారు. అయినా క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం… ఈ వ్యవహారం వెనుక ఉన్న బలమైన ‘నెక్సస్’ను బయటపెడుతోంది. వైరా రోడ్డులోని గోపాలపురం పరిధిలో ఉన్న ఈ పార్క్ భూమి కబ్జా విషయం ఇప్పుడు ఎవరికి తెలియని విషయం కాదు. ఫీల్డ్లో కనిపిస్తున్న సత్యం. నిజానికి విచారణ అవసరం లేని స్థాయిలో స్పష్టమైన కబ్జాను కూడా ‘డౌట్ కేసు’గా చూపించడం వెనుక ఉద్దేశం ఏమిటి అన్న ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.
విచారణ పేరుతో ముసుగు
కలెక్టర్ ఆదేశాల తర్వాత వెంటనే చర్యలు తీసుకోవాల్సిన ఆర్డీవో కార్యాలయం ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫైళ్లు దొరకడం లేదా..? విచారణపై నివేదిక సమర్పించడానికి ఆర్డీవోకు ఉన్న అడ్డంకులేంటి..? ఎవరు అడ్డుకుంటున్నారు? ఎందుకు నివేదిక ఇవ్వడం లేదు? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. బృందంలోని అందరూ అధికారులు నోరు మూసుకుని కూర్చోవడం వెనుక అసలు కథ ఏమిటి? వివరణ అడిగితే “చూస్తున్నాం… చెబుతాం” అనే మాటలు తప్ప స్పష్టత రావడం లేదు. ఇదే సమయంలో కబ్జాదారులు మాత్రం నిర్మాణాలను ఆపకుండా ముందుకు తీసుకెళ్తుండటం గమనార్హం.
టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారు? ఇవ్వకపోతే ఎందుకు అడ్డుకోలేదు? రెవెన్యూ రికార్డుల్లో మార్పులు ఎప్పుడు జరిగాయి? స్టే ఉన్నప్పటికీ నిర్మాణాలు ఎలా కొనసాగుతున్నాయో చెప్పాల్సిందే. పట్టణ ప్రకృతి వనం… అంటే ప్రజల కోసం కేటాయించిన స్థలం. కానీ ఇప్పుడు అక్కడ కాంక్రీట్ నిర్మాణాలు వెలుస్తున్నాయి. నగరంలో గజం ధర ఆకాశాన్ని తాకుతున్న ప్రాంతంలో ఈ భూమిని కబ్జాదారులు పక్కా ప్రణాళికతో టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ముందుగానే ప్రణాళిక వేసుకుని, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కబ్జా పూర్తి చేసినట్టు కనిపిస్తోంది. ఈ స్థాయిలో ఆక్రమణలు జరగాలంటే… అధికారుల సహకారం లేకుండా అసాధ్యం. అధికారుల జేబుల్లోకి నోట్ల మూటలు చేరాయా అన్న ప్రశ్న ఇప్పుడు ఖమ్మం నగర ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. టౌన్ ప్లానింగ్ నుంచి రెవెన్యూ వరకు… ప్రతి దశలో ‘క్లియరెన్స్’ ఎలా దొరికింది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది అదే శాఖలు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడం… కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచనలు ఫలితం ఇవ్వకపోవడం అంటే జిల్లా పరిపాలనే సరెండర్ అయి ఉండాలి.. లేదంటే అధికారులే అక్రమార్కులను రక్షించేందుకు పూర్తి స్థాయిలో సరెండర్ అయ్యి ఉండాలి పరిపాలనా వ్యవస్థకు నేరుగా విసరుతున్న సవాల్ అని చెప్పుకోవాల్సిందే.
కబ్జాదారులను ప్రొత్సహిస్తున్నట్టే లెక్కా..
ఇది ఒక పార్క్ భూమి అంశమే కాదు… ప్రభుత్వ భూముల భవిష్యత్తు మీద ప్రశ్నగా చెప్పుకోవాలి. ఈరోజు ప్రకృతి వనం మాయం అయితే రేపు నగరంలోని ఇతర ప్రభుత్వ స్థలాల జోలికి పోరన్న నమ్మకం ఏంటీ..? విచారణ పేరుతో కాలం గడిపితే కబ్జాదారులే గెలుస్తారు. ఇప్పటికైనా నిజాలు బయటపెట్టి, బాధ్యులపై ఉక్కుపాదం మోపితేనే ఈ కబ్జా సంస్కృతికి చెక్ పడుతుంది. లేకపోతే… ఖమ్మం నగరంలో ప్రభుత్వ భూమికి రక్షణ లేదు.. కబ్జాదారులకు అడ్డు లేదన్న విషయం మరోసారి చాటినట్లు అవుతుంది. ఏం చేస్తారో మంత్రి తుమ్మల, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సారే తేల్చకోవాలి.


