విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం
నిమిషాల్లోనే కార్యాలయ సేవలు
రోజులు పట్టే పనులు నిమిషాల్లో పూర్తి
ఏఐ హ్యాకథాన్కు విశేష స్పందన
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్
డిజిటల్ మార్పుల దిశగా ఎన్పీడీసీఎల్ అడుగులు
కాకతీయ, హనుమకొండ : విద్యుత్ రంగంలో కృత్రిమ మేధ వినియోగంతో పనితీరు పూర్తిగా మారిపోతోందని, రోజులు పట్టే పనులు నిమిషాల్లో పూర్తయ్యే స్థాయికి సాంకేతికత చేరుకుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్లో నిర్వహించిన ఏఐ హ్యాకథాన్ సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశానికి ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధ్యక్షత వహించగా, తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ఉన్నతాధికారులు, సీఈలు, జీఎంలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతను సక్రమంగా వినియోగిస్తే సంస్థల పనితీరులో విప్లవాత్మక మార్పులు సాధ్యమని నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. రెండు మూడు రోజులు పట్టే పనులను కేవలం పది నిమిషాల్లో పూర్తి చేసే సామర్థ్యం ఏఐలో ఉందని పేర్కొన్నారు.
ఏఐతో వేగం, ఖచ్చితత్వం పెంపు
సంస్థలోని వివిధ విభాగాల పనితీరును ఏఐ ఆధారిత ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. ఇప్పటికే అమలులో ఉన్న డిజిటల్ చర్యలతో పాటు భవిష్యత్లో చేపట్టనున్న ప్రణాళికలపై చర్చించారు. కృత్రిమ మేధ వినియోగంతో సేవల వేగం, ఖచ్చితత్వం, పారదర్శకత పెరిగి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించగలమని తెలిపారు. డిజిటల్ మార్పుల దిశగా ఎన్పీడీసీఎల్ కీలక అడుగులు వేస్తోందని, ఏఐ అమలుకు దశలవారీ కార్యాచరణ సిద్ధమైందని వెల్లడించారు. వినియోగదారులకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం అధికారులు ఓగులాపూర్లోని నాలుగు వందల కేవీ మానవరహిత సబ్స్టేషన్ను సందర్శించారు. నిర్వహణ విధానాలు, వోల్టేజ్ స్థాయిలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి మోహన్ రావు, వి తిరుపతి రెడ్డి, టి మధుసూదన్, సి ప్రభాకర్, సీఈలు తిరుమల్ రావు, రాజు చౌహన్, సురేందర్, వెంకట రమణ, మాధవ రావు, అన్నపూర్ణతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


