పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు
భక్తులకు సులభ ప్రయాణం
వేములవాడ నుంచి కాలేశ్వరం, యాదగిరిగుట్టలకు సర్వీసులు
రవాణా సౌకర్యాల విస్తరణకు చర్యలు
బస్టాండ్ల ఆధునీకరణకు నిధుల మంజూరు
మహిళలకు ఉచిత ప్రయాణంతో లాభాలు
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సు సర్వీసులు కల్పించడం ద్వారా భక్తులకు సులభ ప్రయాణం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ డిపో నుంచి కాలేశ్వరం, యాదగిరిగుట్టలకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ నుంచి ఇతర పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సు సౌకర్యం కల్పించడం భక్తులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఇప్పటికే వేములవాడ నుంచి తిరుపతికి నడుస్తున్న బస్సులు మంచి స్పందన పొందుతున్నాయని, భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రాంతాలకు కూడా సర్వీసులు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి సిరిసిల్ల, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల డిపోల నుంచి కూడా బస్సుల సంఖ్య పెంచాలని కోరినట్లు వెల్లడించారు.
బస్టాండ్ల ఆధునీకరణకు ప్రాధాన్యం
వేములవాడ బస్టాండ్ అభివృద్ధికి రూ.1.60 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కథలాపూర్, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట ప్రాంతాల్లోని బస్టాండ్లను కూడా దశలవారీగా ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. తిప్పాపూర్ బస్టాండ్ తొలగింపునకు గతంలో ప్రయత్నాలు జరిగితే తాను అడ్డుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల వారి ఆదాయం ఆదా అవుతోందని, వ్యాపార కార్యకలాపాలు కూడా పెరిగినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు జీవిత బీమా అందిస్తున్నామని చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని, తిప్పాపూర్ మూడవ వంతెన, రహదారి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. భవిష్యత్తులో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంబడి ఉన్న పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. త్వరలో భద్రాచలం, బాసరలకు కూడా బస్సు సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వేములవాడ–ముంబై బస్సు సర్వీస్ విజయవంతంగా నడుస్తోందని, ప్రజలు ఆర్టీసీ బస్సులను ఎక్కువగా వినియోగించాలని ఆది శ్రీనివాస్ కోరారు.


