సంబోజు శేఖర్ మృతి పత్రికా రంగానికి తీరని లోటు
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్
కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
కాకతీయ, కరీంనగర్ : సీనియర్ జర్నలిస్టు సంబోజు శేఖర్ మృతి పత్రికా రంగానికి తీరని లోటని టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు, చొప్పదండి వార్త విలేకరి సంబోజు శేఖర్ గుండెపోటుతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిజం రంగంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి జర్నలిస్టు సమాజానికి పెద్ద లోటని తెలిపారు. బాధిత కుటుంబానికి యూనియన్ తరఫున తక్షణ సహాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి ఊరడి రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు జన్నారం శ్రీనివాస్, కంకణాల రఘు పాల్గొన్నారు.


