పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మార్వో భార్య నిరసన
తనను పట్టించుకోవడం లేదని ఆవేదన
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా భర్తపై ఆరోపణలు
కాకతీయ, వరంగల్ బ్యూరో : తన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎమ్మార్వో గిరిబాబు భార్య ఝాన్సీ రాణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె నిరసన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన ఎమ్మార్వో గిరిబాబు తనను, తన పిల్లలను పట్టించుకోకుండా మరో మహిళతో నివసిస్తున్నారని ఆరోపించారు. గత కొంతకాలంగా కుటుంబంపై నిర్లక్ష్యం పెరిగిందని, తమను మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు ప్రశ్నించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లలు కూడా తమ బాధను వ్యక్తం చేశారు. తండ్రి తమతో ఉండకుండా వేరే మహిళతో ఉండటం వల్ల మానసికంగా కృంగిపోతున్నామని తెలిపారు. కుటుంబం విడిపోవడం తమకు తీవ్రంగా బాధ కలిగిస్తోందని చెప్పారు. తండ్రి తిరిగి కుటుంబంతో కలిసి ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో సహజీవనం చేయడం చట్ట విరుద్ధమని ఝాన్సీ రాణి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి ఎమ్మార్వోపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.


