కాళేశ్వరంపై దుష్ప్రచారం
బ్యారేల అంశం మొత్తం ప్రాజెక్టులో చిన్న భాగమే
మొత్తం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం జరుగుతోంది
ఐదు వందల కోట్లతోనే మరమ్మతులు సాధ్యం
ప్రాణహిత జలాల వినియోగంలో ప్రభుత్వం విఫలం
కేంద్రమంత్రి వ్యాఖ్యలు అవగాహన లేమితోనే
జీవనాడి కాళేశ్వరం… నిర్లక్ష్యం రాష్ట్రానికే ప్రమాదకరం
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్ట్పై దుష్ప్రచారం జరుగుతోందని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి చేసిన “లక్ష కోట్లు కొట్టుకుపోయాయి” అన్న వ్యాఖ్యలు అవగాహన లోపంతో చేసినవేనని పేర్కొంటూ, ఇవి వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నమని మండిపడ్డారు. జగిత్యాలలో తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు మొత్తం ప్రాజెక్ట్లో చిన్న భాగమేనని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్లో చోటుచేసుకున్న సమస్యలను మొత్తం కాళేశ్వరం వ్యవస్థపై మోపడం రాజకీయ ఉద్దేశంతోనే జరుగుతోందని ఆరోపించారు. నిర్మాణ లోపమా, నిర్వహణ లోపమా అన్నది పక్కన పెడితే, బ్యారేజీల పిల్లర్లు కుంగి రెండేళ్లు గడిచినా పునరుద్ధరణ చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మూడు బ్యారేజీల మరమ్మతులకు భారీగా ఖర్చవుతుందన్న ప్రచారం ప్రజలను తప్పుదారి పట్టించేదేనని, కేవలం ఐదు వందల కోట్లతో పనులు పూర్తి చేయవచ్చని స్పష్టం చేశారు. సంబంధిత భద్రతా సంస్థ నివేదిక వచ్చినా చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమన్నారు.
జీవనాడి కాళేశ్వరం… నిర్లక్ష్యం రాష్ట్రానికే ప్రమాదం
కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు జీవనాడిగా నిలిచిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ సాగునీటి అవసరాలతో పాటు హైదరాబాద్ తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, ముసి శుద్ధీకరణ కూడా ఈ ప్రాజెక్ట్పైనే ఆధారపడి ఉన్నాయని గుర్తుచేశారు. ప్రాణహిత జలాలను వినియోగించడంలో ప్రభుత్వం కనీస ప్రణాళికలు కూడా రూపొందించలేదని విమర్శించారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించడంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణ ఆలస్యం అయితే దాదాపు పద్దెనిమిది లక్షల ఎకరాల సాగు భూములు తీవ్రంగా ప్రభావితమవుతాయని హెచ్చరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో నీటి సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వంలో మార్పు రావాలి
ప్రస్తుత ప్రభుత్వం విమర్శలకే పరిమితమై చర్యల్లో విఫలమైందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ప్రజల ఆస్తులని, వాటి సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ పనులు చేయకపోతే ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకొని మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా స్పందిస్తూ గతంలో “మార్పు రావాలి.. కేసీఆర్ పోవాలి” అన్న నినాదంతో ప్రజలు మార్పు తీసుకువచ్చారని, ఇప్పుడు రెండేళ్లలోనే “మార్పు రావాలి.. రేవంత్ రెడ్డి పోవాలి” అనే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. ప్రాణహిత జలాల వినియోగంలో వైఫల్యం, ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రస్తుత పాలన వైఖరిని ప్రతిబింబిస్తోందని తీవ్రంగా విమర్శించారు. తాను భవిష్యత్తులో తీసుకునే రాజకీయ నిర్ణయాలు ప్రజల అభిప్రాయాల మేరకే ఉంటాయని పేర్కొంటూ తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసారు.


