ప్రజా పాలన ప్రజలకు ఉపయోగం లేదు
సమావేశాలు రాజకీయ ప్రయోజనాల కోసమే
బీఆర్ఎస్ వార్డు మెంబర్ ఎస్కే కరిష్మా విమర్శ
కాకతీయ,మణుగూరు : ప్రజా పాలన పేరుతో నిర్వహిస్తున్న సభలు ప్రజలకు ఉపయోగం లేకుండా పోయాయని బీఆర్ఎస్ వార్డు మెంబర్ ఎస్కే కరిష్మా విమర్శించారు. ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా సమావేశాలు నిర్వహించడం ప్రయోజనం లేదని అన్నారు. మణుగూరు సమితి సింగారం గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రజా పాలన సమావేశంపై గురువారం స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వార్డు మెంబర్ ఎస్కే కరిష్మా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య మనుగడ కోల్పోతుందన్న భయంతోనే ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా మారిందన్నారు. ఇండ్ల మధ్య చెత్త పేరుకుపోయి పారిశుద్ధ్యం దెబ్బతింటోందని చెప్పారు. కొత్త డ్రైనేజీ నిర్మాణాలు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు రాక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వీధి లైట్లు సరిగా లేకపోవడం, మంచినీటి సమస్యలు తీవ్రంగా ఉండటం, పాత పైపులు పగిలినా మరమ్మతులు లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందన్నారు. చెత్త సేకరణ వాహనం కూడా లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రజా సమస్యలపై ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందని ఆమె ఆరోపించారు.


