చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించండి
* సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
కాకతీయ,చేర్యాల : అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. ఉమ్మడి రంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురవెళ్ళి, ధూల్మిట్ట మండలాలతో చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు గత 10 సంవత్సరాల నుంచి జేఏసీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో నూతన మండలాలు ఏర్పాటు చేసిన సందర్భంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయలేదు. శాసనసభఎన్నికల సందర్భంగా జనగామలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తమరు చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి దాదాపు 35 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సివస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గం జనగామ, ఎంపీ భువనగిరి, జిల్లా కేంద్రం సిద్ధిపేట ఇలా వివిధ ప్రాంతాలకు అశాస్త్రీయంగా విడదీయడంతో ఈ ప్రాంత ప్రజలు పనుల కోసం వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చేర్యాల ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేర్యాల, మద్దూరు, కొమురవెళ్ళి, దూళిమిట్ట మండలాలను కలుపుకొని చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాల్సిందిగా సీపీఐ పార్టీ పక్షాన తమరిని ప్రత్యేకంగా కోరుతున్నామని పేర్కొన్నారు. చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఆకాంక్ష ఆవశ్యకతను గుర్తించిన సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ల దృష్టికి తీసుకెళ్లినందుకు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్,బుట్టి భిక్షపతి,చేర్యాల మండల సమితి, జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.


