భూ స్కాంలో ఆస్తుల అటాచ్మెంట్
వెలుగుమట్ల ఘటనలో మోసాలకు ముఠాకు షాక్
నిందితుల స్తిర, చర ఆస్తుల గుర్తింపుపై పోలీస్శాఖ ఫోకస్
45లక్షల విలువ చేసే ఐదు వాహనాలు స్వాధీనం
1549 మంది పేదల నుంచి రూ.2.5కోట్లకు పైగా వసూళ్లు
ఏడుగురు ప్రధాన నిందితుల నుంచి సమాచారం సేకరణ
కాకతీయ, ఖమ్మం బ్యూరో : భూదాన్, ప్రభుత్వ భూములను పేదలకు ఆశగా చూపి దందాలు సాగించిన వారిపై పోలీస్ శాఖ సీరియస్గా చర్యలు తీసుకుంటోంది. పేద ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి కూడబెట్టుకున్న వారిని ఇప్పటికే గుర్తించి కేసులు నమోదు చేసిన ఖమ్మం పోలీసులు..ఇప్పుడు వారి ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నిందితుల నుంచి 10 లక్షలకు పైగా విలువ చేసే ఐదు వాహనాలను సీజ్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలో భూదాన్, ప్రభుత్వ భూములపై అక్రమంగా ప్లాట్లు విక్రయిస్తూ భారీగా వసూళ్లు చేసిన ము|ఠాపై కేసులు నమోదు అయ్యాయి. ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ సహా ఇతర స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. విచారణలో బల్లి శ్రీనివాస్ అలియాస్ శ్రీను, పోలెబోయిన ముత్తయ్య, కొప్పెర వెంకన్న, తాళ్లూరి కృష్ణ, కుంజా కృష్ణయ్య అలియాస్ కృష్ణ, కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణాచారి తదితరులను కస్టడీకి తీసుకుని విచారించారు. విచారణలో సుమారు 1549 మంది బాధితుల నుంచి రూ.2,88,38,100 వసూలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని అధికారులు తెలిపారు. ఆ డబ్బులో కొంత భాగాన్ని కోర్టు ఖర్చులు, ర్యాలీలు, సర్వేలు, భూదాన్ వినోబా నవోదయ కాలనీలో తాత్కాలిక సౌకర్యాల పేరుతో ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు, స్థిర ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు వెల్లడైంది.
ఆస్తుల గుట్టు విప్పిన విచారణ
తాళ్లూరి కృష్ణ ఏపీ 20 టి ఏ 1363 నంబర్ ట్రాక్టర్ కొనుగోలు చేయడంతో పాటు కవిరాజ్ నగర్ రోడ్డు నెంబర్ 1లో 64.54 గజాల విస్తీర్ణంలో ఇంటిపై 19 లక్షల 90 వేల రూపాయలు వెచ్చించి రెండు అంతస్తులు నిర్మించినట్లు తెలిసింది. బాణాల లక్ష్మణాచారి టిఎస్ 05 ఈఆర్ 1100 నంబర్ హీరో డీలక్స్ మోటార్ సైకిల్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పోలెబోయిన ముత్తయ్య టిఎస్ 28 టి 2868 నంబర్ టాటా మ్యాజిక్, టిఎస్ 04 యూఈ 6290 నంబర్ టాటా ఇంట్రా వాహనాలను వినియోగించినట్లు బయటపడింది. కొప్పెర వెంకన్న టిఎస్ 29 బి 8489 నంబర్ స్ప్లెండర్ మోటార్ సైకిల్తో పాటు 10 లక్షల విలువ గల ఇంటి స్థలం కొనుగోలు చేసి, తన కుమారుడి చదువులకు ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైంది. చిప్పలపల్లి వీరయ్య 4 లక్షల 48 వేల 744 రూపాయల నగదును, మరో 10 లక్షల రూపాయలను ఎన్కూరుకు చెందిన వ్యక్తి వద్ద ఉంచినట్లు గుర్తించారు.
ఆస్తుల అటాచ్మెంట్కు సన్నాహాలు
నిందితుల వద్ద ఉన్న మొత్తం స్థిర, చర ఆస్తుల విలువ సుమారు 44 లక్షల 78 వేల 744 రూపాయలుగా అంచనా వేశారు. ఇందులో ఐదు వాహనాలు 10 లక్షల 40 వేల రూపాయలు, ఇల్లు 19 లక్షల 90 వేల రూపాయలు, ఇంటి స్థలం 10 లక్షలు, బ్యాంక్ ఖాతాల్లో 4 లక్షల 48 వేల 744 రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆస్తుల అటాచ్మెంట్ కోసం చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కస్టడీ విచారణ అనంతరం నిందితులను న్యాయస్థానానికి హాజరుపరచి రిమాండ్కు తరలించారు. భూదాన్, ప్రభుత్వ భూముల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.


