ఆయుర్వేద చదువులు ఆగమాగం!
అధ్యాపక పోస్టులు అన్నీ ఖాళే!
15 మందికి ఒక్కరూ కూడా లేరు!
10 మంది కాంట్రాక్ట్ బోధకులతో కాలం వెళ్లదీత!
ఇతర సిబ్బంది కూడా అరకొరే!
ఇదీ అనంతలక్ష్మీ ఆయుర్వేద వైద్య కాలేజీ తీరు
కాకతీయ, వరంగల్ : ఆంగ్ల వైద్యం కంటే ఆయుర్వేద వైద్యంపైనే ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల నివారణ కోసం బాధితులు చెట్ల మందులనే ఇష్టపడుతున్నారు. నయం కావడానికి ఎక్కువ సమయం తీసుకున్నా.. పూర్తిస్థాయిలో తగ్గుతుందనే నమ్మకంతో ఆయుర్వేద వైద్యానికి ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది. అయితే, ఆయుర్వేద విద్య అభివృద్ధి పట్ల మాత్రం నిర్లక్ష్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అందుకు వరంగల్ లోని అనంతలక్ష్మీ ఆయుర్వేద వైద్య కళాశాలలోని పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆంగ్ల వైద్యాన్ని అడుగడుగునా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు వాటి సంఖ్య పెంచేందుకు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అవసరమైతే గల్లీకో హాస్పిటల్ కట్టేందుకు కూడా ప్రభుత్వాలు మొగ్గుచూపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ, పురాతన, పూర్వీకుల వైద్యంగా పేర్కొనే ఆయుర్వేద వైద్య రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు తగిన స్థాయిలో దృష్టి పెట్టడం లేదని స్పష్టమవుతోంది. పురాతన వస్తువుల పేరిట రాళ్లు, రప్పలను సేకరించి, వాటిని భద్రపరిచేందుకు వెచ్చించే అన్ని నిధులు కూడా ఆయుర్వేద వైద్య అభివృద్ధికి ప్రభుత్వాలు వెచ్చించడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు వరంగల్ అనంతలక్ష్మీ ఆయుర్వేద వైద్య కాలేజీలో పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు.
అరకొర సిబ్బందితోనే కాలం వెళ్లదీత!
అనంతలక్ష్మీ ఆయుర్వేద వైద్య కాలేజీలో అన్ని విభాగాల్లో ఉద్యోగులు, సిబ్బంది కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాలేజీ కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ ఉన్నప్పటికీ.. అసలు కాలేజీ నడవడానికి అవసరమైన బోధకులే లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ కాలేజీకి 15 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉంటుందని రికార్డులు వెల్లడిస్తుండగా, ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. కేవలం క్రాంటాక్ట్ అధ్యాపకులతో తరగతులు సాగిస్తున్నారు. అది కూడా పదిమందితోనే కాలం నెట్టుకొస్తున్నారు. ఆఫీసు కార్యకలాపాల్లో టైపిస్టు లేడు, లెబ్రేరియన్ పోస్ట్ ఒకటి ఖాళీగానే ఉంది. డ్రైవర్ నియమాకం నిలిచిపోయింది. వాచ్మెన్ నలుగురికి ఇద్దరే ఉన్నారు. స్వీపర్, స్కావెంజర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం ఒక్కరితోనే రెండు స్థాయిల పని చేయిస్తూ వ్యవస్థను లాగిస్తున్నారు. మొత్తంగా అన్ని విభాగాల్లో 67 మంది ఉండాల్సి ఉండగా, 28 మందితోనే చదువుల ఆలయంలో సేవలు కొనసాగుతున్నాయి. 39 పోస్టులు ఇంకా భర్తీ కావాల్సి ఉండగా, ప్రభుత్వం నియమించే అవకాశం లేదని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.


