హెచ్పీవీ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభం
కాకతీయ, ఖిలా వరంగల్ :ఖిలా వరంగల్ ప్రభుత్వ దవాఖానలో బుధవారం హెచ్పీవీ వ్యాక్సినేషన్ సెంటర్ను స్థానిక కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్పీవీ వ్యాక్సిన్ను 14 సంవత్సరాలు పూర్తి చేసిన బాలికలు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాక్సిన్ ద్వారా సర్వికల్ క్యాన్సర్ను సుమారు 95 శాతం వరకు అరికట్టవచ్చని తెలిపారు. గతంలో ఈ సేవలు ఎంజీఎం, సీకేఎం హాస్పిటళ్లలో మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం వరంగల్ నగరంలోని అన్ని ప్రభుత్వ హెల్త్ సెంటర్లు, ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. 14 సంవత్సరాలు నిండిన ప్రతి బాలికకు వ్యాక్సిన్ వేయించేవరకు రెండు నెలలపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధ, ఏఎన్ఎంలు రాణి, ప్రణీత, శిరీష, హాస్పిటల్ సిబ్బంది సంజయ్ కుమార్, అభిషేక్, మాధవరావు, క్రాంతి మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


