మార్చి 31న రైతు సదస్సును విజయవంతం చేయాలి
*తెలంగాణ రైతు సంఘం కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ పిలుపు
కాకతీయ,గీసుగొండ: వరంగల్ నగరంలోని అబ్బనికుంట రైతు భవనంలో మార్చి 31న నిర్వహించనున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సదస్సును రైతులు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.మండలంలోని వంచనగిరి గ్రామంలో నిర్మించిన గ్రామ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రైతులు పండించిన పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పూర్తిస్థాయిలో విక్రయించుకునే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై ప్రచారం జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు పంటను అమ్ముకోవాల్సి వస్తోందని, క్వింటాల్కు రూ.400 నుంచి రూ.500 వరకు నష్టపోతున్నారని చెప్పారు. ఎకరానికి సుమారు రూ.20 వేల వరకు నష్టం వాటిల్లు తోందని వివరించారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను విస్తరించి ఎలాంటి షరతులు లేకుండా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య మాట్లాడుతూ ఈ సదస్సుకు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ తదితరులు హాజరవుతారని తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు మోకిడే పీరయ్య, రైతులు యాదగిరి, నర్సింగరావు, ఎండి బషీర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


