ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలి
టీ టీడీపీ రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు
ఖమ్మంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు, జెండా ఆవిష్కరణ
కాకతీయ, ఖమ్మం : స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలను అనుసరిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఎన్టీఆర్ సేవల స్మరణ
ఈ సందర్భంగా కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్టీఆర్ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. స్థాపించిన కొద్ది కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి పలు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నేతలు ఎన్టీఆర్ సర్కిల్ వరకు పాదయాత్రగా వెళ్లి నివాళులు అర్పించారు. కార్యాలయంలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రసంగాలను వీక్షించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించి నాయకులను శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కేతినేని హరీష్, వడ్డేం విజయ్, గుత్తా సీతయ్య, వనమ వాసు, మందడపు సుధాకర్, మంద వెంకటనారాయణ, మండపూడి శ్రీనివాస్, గుండెపిన్ని నాగేశ్వరరావు, చింతనిప్పు నాగేశ్వరరావు, మీగడ రామారావు, నాగార్జున శ్రీనివాస్, రాజరాజేశ్వరి, మేకల సత్యవతి, చలసాని ఝాన్సీ, నల్లమల రంజిత్, కన్నేటి పృధ్వీ, నాగండ్ల లక్ష్మణ్, నున్నా నవీన్, బ్రహ్మం, నల్లమల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


