మూడేళ్ల కుమారుడితో మృత్యువు ఒడిలో తల్లి
మూడేళ్ల కుమారుడితో కలిసి కాలువలో దూకి తల్లి ఆత్మహత్య
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో తీరని విషాదం నెలకొంది. కట్ర్యాల గ్రామ శివారులో ఓ తల్లి తన మూడేళ్ల కుమారుడితో కలిసి కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రోజున కట్ర్యాల గ్రామ శివారులోని కాలువలో కామిండ్ల కళ్యాణి (30) తన కుమారుడు శ్రేష్యాన్ష్ (3)తో కలిసి దూకి తనువు చాలించింది. స్థానికులు వీరి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
కళ్యాణికి నాలుగేళ్ల క్రితం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్కు చెందిన హరీష్తో వివాహమైంది. హరీష్ ప్రస్తుతం మామునూరు బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు.
మృతురాలు తన చిన్నారిని తీసుకుని ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలా లేక మరేదైనా కారణమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకేసారి తల్లి, కొడుకు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


