చిన్న ప్రయాణమైనా సీట్బెల్ట్ తప్పనిసరి
కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్–ఫేజ్-III’ అవగాహన కార్యక్రమం
కాకతీయ, రామగుండం : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్–ఫేజ్-III’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గోదావరిఖని వన్టౌన్ పరిధిలోని మున్సిపల్ చౌరస్తా వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనల పాటింపు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీట్బెల్ట్ ధరించాలని సూచించారు. ప్రస్తుతం జరిగే ప్రమాదాల్లో దాదాపు 70 శాతం ఘటనల్లో సీట్బెల్ట్ ధరించకపోవడం వల్లే తీవ్ర గాయాలు, ప్రాణనష్టం జరుగుతున్నట్లు తెలిపారు. సీట్బెల్ట్ వినియోగంతో ప్రమాద సమయంలో ప్రాణాపాయం గణనీయంగా తగ్గుతుందని వివరించారు.
ఫోర్వీలర్ వాహనాల్లో ఎయిర్బ్యాగ్లు ఉన్నప్పటికీ, సీట్బెల్ట్ ధరించకపోతే అవి సమర్థవంతంగా పనిచేయవని స్పష్టం చేశారు. కాబట్టి ఎయిర్బ్యాగ్లు ఉన్నా లేకపోయినా ప్రతి ప్రయాణంలో సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
వాహనం కొనుగోలు సమయంలో భద్రతా సదుపాయాలు ఉన్న మోడళ్లను ఎంచుకోవాలని, ముఖ్యంగా ఎయిర్బ్యాగ్లు, సీట్బెల్ట్ రిమైండర్లు వంటి ఫీచర్లను పరిశీలించాలని పేర్కొన్నారు. చిన్నదూరమైనా, పెద్దదూరమైనా సీట్బెల్ట్ అలవాటు చేసుకుంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, ఎస్ఐలు రమేష్, అనూష, మనోహర్, ట్రాఫిక్ ఎస్ఐ హరీష్ శేఖర్, రామరాజు తదితరులు పాల్గొన్నారు.


