పారిశుధ్య కార్మికులపై పెత్తనం
ఎస్సై దౌర్జన్యం బహిర్గతం!
కార్మికులపై బెదిరింపులు, బూతు దండకం
సెలవులు ఇవ్వకుండా వేధింపులు
డ్రైవర్లు, కార్మికుల జీతాల్లో అడ్డగోలుగా కోతలు
9 నుంచి 23 డివిజన్లలో కార్మికుల అరిగోస
రాజకీయ అండతో ఇష్టారాజ్యం ఆరోపణలు
నగరపాలక సంస్థలో పారిశుధ్య వ్యవస్థపై ప్రశ్నలు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికులపై ఒక పారిశుధ్య ఎస్సై పెత్తనం చలాయిస్తున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోజూ నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు కష్టపడుతున్న కార్మికులనే లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెలవులు ఇవ్వకుండా బెదిరించడం, బూతులు తిట్టడం, జీతాల్లో కోతలు విధించడం వంటి చర్యలతో కార్మికులు మానసికంగా కుంగిపోతున్నారని సమాచారం. నగరపాలక సంస్థలో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం డివిజన్లను సెక్టార్లుగా విభజించి ఎస్సైలకు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో, కొందరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 9వ డివిజన్ నుంచి 23వ డివిజన్ వరకు పని చేస్తున్న కార్మికులు ఒకే ఎస్సై చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
సెలవులు అడిగితే శిక్షలా…
అనారోగ్యం కారణంగా సెలవులు కోరిన కార్మికులను వదలకుండా మరింత ఒత్తిడి పెడుతున్నారని బాధితులు చెబుతున్నారు. సెలవు ఇవ్వనని స్పష్టం చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరిని అసభ్య పదజాలంతో దూషించడం కూడా జరుగుతోందని పేర్కొంటున్నారు. రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత నెలాఖరులో జీతం కోసం ఎదురుచూసే కార్మికులపై అనవసర కోతలు విధించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. చిన్న చిన్న కారణాలతో వేతనాల్లో కోతలు పెట్టి జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నారని కార్మికులు అంటున్నారు.
రాజకీయ అండతో నిరంకుశ ధోరణి
సదరు ఎస్సై వెనుక రాజకీయ నాయకుల అండ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కుటుంబ సంబంధాలు, రాజకీయ పరిచయాలను ఉపయోగించుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. మమత రోడ్డు, మధురానగర్, శ్రీరామ్ నగర్, పులిపాటి కాలనీ, గొల్లగూడెం ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. తమ సమస్యలు చెప్పుకునే స్థితి లేకపోవడంతో లోలోపలే మానసికంగా బాధపడుతున్నారని చెబుతున్నారు.
మొత్తంగా ఖమ్మం నగరపాలక సంస్థలో పారిశుధ్య విభాగం పనితీరుపై ఈ ఘటన ప్రశ్నలు లేవనెత్తుతోంది. నగరాన్ని శుభ్రంగా ఉంచే కార్మికులే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం దురదృష్టకరం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.


