కమనీయం… రాములోరి కల్యాణం
కన్నుల పండువగా వివాహ వేడుక
రామనామస్మరణతో మార్మోగిన వేములవాడ
కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన హరిహర క్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా,ఆధ్యాత్మికోత్సాహంతో నిర్వహించారు. “జై శ్రీరామ్… జై శ్రీరామ్…” అంటూ మారుమోగిన నినాదాలతో ఆలయ ప్రాంగణం భక్తి తరంగాల్లో తేలిపోయింది.వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ దివ్య కళ్యాణాన్ని కళ్లారా వీక్షిస్తూ పరవశించారు.

అభిజిత్ లగ్నంలో శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం
ఉదయం 11:50 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ పవిత్ర వివాహం ఘనంగా జరిగింది. ముందుగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిఅనంతరం పంచోపనిషత్ విధానంలో అభిషేకాలు చేశారు.ఆలయ ఇంచార్జి స్థానాచార్యులు ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో కల్యాణ తంతు ప్రారంభమై,గుడి చెరువు పార్కింగ్ ప్రాంగణంలోని శివార్చన వేదికపై ఉత్సవమూర్తుల దివ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
పట్టు వస్త్రాల సమర్పణ…
ఈ మహోత్సవానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు హాజరై ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని భక్తిశ్రద్ధలతో సేవలందించారు.కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తరపున కూడా ఆలయానికి పట్టు వస్త్రాలు పంపించారు.
భక్తుల కోసం సమగ్ర ఏర్పాట్లు
భారీగా తరలివచ్చిన భక్తజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేపట్టారు.కళ్యాణాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించేలా భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను తగ్గించేందుకు చలువ పందిళ్లు, ప్రత్యేక మండపాలు నిర్మించారు.భక్తుల రద్దీని క్రమబద్ధంగా నియంత్రించేందుకు 15 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసి ఒక్కో విభాగంలో కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. దాతల సహకారంతో మజ్జిగ, చల్లని త్రాగునీరు పంపిణీ చేయగా, సుమారు 40 వేల మందికి అన్నదానం నిర్వహించారు.
శివపార్వతుల వేషధారణలో భక్తులు
ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన సంప్రదాయం ప్రకారం శివపార్వతుల వేషధారణలో వచ్చిన భక్తులు త్రిశూలానికి బాసింగం కట్టి, జీలకర్ర-బెల్లం పెట్టుకుని తలంబ్రాలు పోసుకుంటూ తమను శివపార్వతులుగా భావించుకుంటారు.ఈ దృశ్యాలు కళ్యాణోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, భక్తులలో భక్తిశ్రద్ధలను మరింతగా పెంచాయి.తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆనవాయితీ వేములవాడ క్షేత్ర ప్రత్యేకతను ప్రతిబింబించింది.
ప్రత్యేక ఆకర్షణగా ట్రాన్స్జెండర్లు
శ్రీరామనవమి సందర్భంగా దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన ట్రాన్స్జెండర్ భక్తులు వేములవాడలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.సంప్రదాయ దుస్తుల్లో, భక్తి భావంతో ఆలయానికి చేరుకున్న వారు స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తూ తమ భక్తిశ్రద్ధలను వ్యక్తపరిచారు.కళ్యాణ వేళలో తలంబ్రాలు పోసుకుంటూ, ఒకరిపై ఒకరు ఆనందోత్సాహాలతో ఆశీర్వాదాల వర్షం కురిపించుకోవడం అక్కడి భక్తులను ఆకట్టుకుంది. వారి ఉత్సాహం, ఆధ్యాత్మిక అనుభూతి కలిసిన ఆ దృశ్యాలు వేడుకకు మరింత ప్రత్యేకతను తెచ్చాయి.ఇక ఆలయ ప్రాంగణంలో వారు గుమికూడి “జై శ్రీరామ్” నినాదాలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.


