కల్యాణ వైభోగం
వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
మిథిలా మైదానంలో అభిజిత్ లగ్నంలో అట్టహాసంగా వేడుక
జైశ్రీరామ్ నామస్మరణతో మార్మోగిన భద్రాచలం
పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ దంపతులు
కుటుంబ సభ్యులతో కలిసి కల్యాణంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు
ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి రాములోరి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సీతా సమేత శ్రీరామచంద్రుడి కల్యాణాన్ని మిథిలా మైదానంలో అభిజిత్ లగ్నంలో అట్టహాసంగా నిర్వహించారు. సీతమ్మ తల్లిని శ్రీరాముడు మనువాడే అద్భుత ఘడియల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న రామభక్తులు ఈ లోకకల్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. సీతారాముల కల్యాణ వేడుకను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అర్చకుల వేదమంత్రాలు, భక్తుల హర్షధ్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో మాంగళ్యధారణ కార్యక్రమం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీత దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి స్వామి వారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు. కల్యాణం అనంతరం ప్రముఖులకు వేద పండితులు స్వామివారి గోటి తలంబ్రాలు అందజేశారు.

రూ.351 కోట్లతో భూమిపూజ
ఈ కల్యాణ మహోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు భద్రాచలం ఆలయ అభివృద్ధికి తొలి విడతలో రూ.351 కోట్లతో చేపట్టే పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు.

ప్రతి ఘట్టం ఆధ్యాత్మిక సాగరమే ..
జగాలను ఏలిన జగదేకవీరుడికి జగన్మాత సీతమ్మకు అభిజిత్ లగ్నంలో జరిగిన కల్యాణ వేడుక కమనీయంగా సాగింది. ఈ వైభవాన్ని కనులారా తిలకించి లోకమంతా పులకించిపోయింది. భద్రాచలం దివ్యక్షేత్రంలో భక్త కోటిని నయనానందకరం చేసింది. ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు సాగిన కల్యాణ క్రతువులో ప్రతీ ఘట్టం ఆధ్యాత్మిక రస సాగరంలో ముంచెత్తింది. ప్రత్యేకంగా అలంకరించిన మిథిలా ప్రాంగణంలో తొలుత తిరు కల్యాణానికి సంకల్పం పలికి, సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టారు.

వేద మంత్రోచ్చారణలు
కల్యాణానికి ఉపయోగించే సామగ్రిని సంప్రోక్షణ చేసిన తర్వాత రక్షా బంధనం నిర్వహించి యోకర్తధారణ చేశారు. ఇరు వంశాల గోత్రాలు పఠించి స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు మార్మోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. ఈ సమయాన్ని శుభ ముహూర్తమని జగత్ కల్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు. రాముడి దోసిట తలంబ్రాలు నీలపు రాసులవుతుంటే జానకి దోసిట తలంబ్రాలు కెంపులయ్యాయి.
నేడు శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భద్రాచలం వచ్చిన భక్త జనానికి ఎలాంటి అసౌర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా సెక్టార్లు ఏర్పాట్లు చేసి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎండ నుంచి ఉపశమనం కలిగేలా చలువ పందిళ్లు వేశారు. భక్తుల తాకిడి పెరుగుతుండటం, ప్రముఖుల రాక ఎక్కువ ఉండటంతో దాదాపు 2 వేల మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో చివరి ఘట్టమైన శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం శనివారం జరగనుంది.


