ఎమ్మార్వోలకు స్థాన చలనం
ఒకేసారి 10మంది అధికారుల బదిలీలు
సాధారణ బదిలీలే అయినా.. కనిపించిన రాజకీయ ప్రభావం
పోస్టింగుల్లో అధికారులకు గ్రహణం.. అనుగ్రహం
ఓ మంత్రి సన్నిహితులు చెప్పిందే జరిగిందా..?
పలుచోట్ల డిప్యుటేషన్లు… కీలక పోస్టుల భర్తీ
మల్టీజోన్ ఖాళీలకు తాత్కాలిక నియామకాలు
ప్రజాపాలన పనుల వేగానికి పరిపాలనా మార్పులు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో భారీ సంఖ్యలో తహసీల్దార్ల బదిలీలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఏకంగా ఒకేసారి పదిమంది ఎమ్మార్వో స్థాయి అధికారులకు స్థానచలనం కల్పిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ బదిలీల వెనుక రాజకీయ ప్రభావం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పరిపాలనా మార్పుల్లో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా మార్పులు చేపట్టినట్లు అధికారికంగా చెబుతున్నప్పటికీ, ఒక తహసీల్దార్ బదిలీ విషయంలో స్థానికంగా రాజకీయంగా తీవ్ర ప్రయత్నాలు జరిగాయన్న ప్రచారం ఊపందుకుంది. ఒక మంత్రి అనుచరులు వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి చివరి వరకు ఒత్తిడి తీసుకువచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో అనేక శాఖల్లో మార్పులు జరిగినా ఖమ్మం జిల్లా మాత్రం చాలా కాలంగా మార్పులకు దూరంగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఒకేసారి పెద్ద ఎత్తున బదిలీలు జరగడం పరిపాలనా కదలికలకు సంకేతంగా భావిస్తున్నారు.
కీలక స్థానాల్లో మార్పులు
జిల్లాలోని తల్లాడ, కల్లూరు, సింగరేణి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి వంటి కీలక మండలాల్లో తహసీల్దార్ స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయి. మల్టీజోన్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేస్తూ డిప్యుటేషన్లు జారీ చేశారు. కే. బ్రహ్మేశ్వర్ రావును తల్లాడ తహసీల్దార్గా నియమిస్తూ కల్లూరులో అదనపు బాధ్యతలు అప్పగించారు. పి. సాంబశివుడును కల్లూరు నుంచి కలెక్టర్ కార్యాలయానికి డిప్యుటేషన్పై పంపారు. ఎం. వినయేందర్ రెడ్డిని సింగరేణి తహసీల్దార్గా నియమించి ఖమ్మం రూరల్ బాధ్యతలు అప్పగించారు. పి. రామ్ ప్రసాద్ను ఖమ్మం రూరల్ నుంచి నేలకొండపల్లికి పంపగా, వి. వెంకటేశ్వర్లు నేలకొండపల్లి నుంచి సింగరేణికి మారారు. డి. జయచందర్ను చింతకాని తహసీల్దార్గా నియమించి ఖమ్మం అర్బన్లో అదనపు బాధ్యతలు అప్పగించారు. డి. సైదులు ఖమ్మం అర్బన్ నుంచి కూసుమంచికి, వి. రవి కూసుమంచి నుంచి ముదిగొండకు మారారు. సునీత ఎలిజిబెత్ను ముదిగొండ నుంచి కలెక్టర్ కార్యాలయానికి పంపగా, సింగరేణిలో ఉన్న ఎ. రమేష్ డిప్యుటేషన్ను రద్దు చేసి పాత స్థానానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
బదిలీల్లో రాజకీయ గ్రహం… అనుగ్రహం..
ఈ బదిలీలు పూర్తిగా పరిపాలనా అవసరాల కోసమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రజాపాలన, ప్రగతి కార్యక్రమాలు, ఎన్నికల జాబితాల సవరణ వంటి కీలక అంశాల దృష్ట్యా అధికారులను సమర్థంగా వినియోగించేందుకు ఈ మార్పులు చేసినట్లు వివరిస్తున్నారు. అయితే స్థానికంగా వినిపిస్తున్న ప్రచారం మాత్రం భిన్నంగా ఉంది. కొందరు అధికారులను కీలక స్థానాల నుంచి తప్పించడం, మరికొందరిని ముఖ్య మండలాలకు పంపించడం వెనుక రాజకీయ సమీకరణలు పనిచేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో భూముల వ్యవహారాలు, పట్టాదారుల సమస్యలు, ల్యాండ్ సెటిల్మెంట్లు కీలకంగా ఉండటంతో ఈ పోస్టులపై రాజకీయ ఆసక్తి ఎక్కువగా ఉండటం సహజమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక డిప్యుటేషన్ విధానం ద్వారా ఒకే అధికారికి రెండు బాధ్యతలు అప్పగించడం కూడా చర్చనీయాంశమైంది. ఇది తాత్కాలిక పరిష్కారమే అయినప్పటికీ, దీర్ఘకాలంలో పరిపాలనా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ తహసీల్దార్ బదిలీలు పరిపాలనా మార్పుల కంటే రాజకీయ చర్చలకు ఎక్కువ దారితీస్తున్నాయి. ఈ మార్పులు నిజంగా ప్రజాపాలనను వేగవంతం చేస్తాయా… లేక రాజకీయ ప్రభావానికే పరిమితం అవుతాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది


