భక్తిరసంతో మారుమ్రోగిన పాటిమీద ఆంజనేయస్వామి ఆలయం
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన స్వయంభూ వెలసిన పాటిమీద ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.వేదమంత్రోచ్చారణల నడుమ జరిగిన ఈ దివ్య కల్యాణం భక్తులకు కన్నుల పండుగగా నిలిచింది. ఆలయ అర్చకులు తిరుమలయ్య, ప్రదీప్ శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆలయ చైర్మన్ గందె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవానికి మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ చైర్మన్ గందె రాధికతో పాటు పలువురు కౌన్సిలర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పిఆర్ స్కూల్ అధినేత జగన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, భక్తుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


