కల్తీ మత్తు.. జీవితాలు చిత్తు
సిరిసిల్లలో విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయాలు
ఇతర ప్రాంతాల నుంచి భారీగా దిగుమతి
అధికారికంగా నాలుగు డిపోలు.. నడుస్తున్నవి మాత్రం ఎనిమిది
ఎక్సైజ్ తనిఖీలపై అనుమానాలు.. జనాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : కార్మిక క్షేత్రంగా పేరొందిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కల్లు విక్రయాలు అదుపు తప్పుతున్నాయి. సహజంగా లభించే తాటి, ఈత వనాలు పెద్దగా లేకపోయినా రోజుకు వేల లీటర్ల కల్లు విక్రయమవుతుండటం అనుమానాలకు తావిస్తోంది.ముఖ్యంగా కూలీలు, నేతకార్మికులు, హమాలీలు వంటి శ్రమజీవులు రాత్రివేళ శ్రమను మర్చిపోవడానికి కల్లును ఆశ్రయిస్తుండటంతో ఈ డిమాండ్ను ఆసరాగా చేసుకుని వ్యాపారులు కల్తీకి తెరలేపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.తక్కువ ధరలో లభిస్తుండటంతో కార్మికులు డిపోల వద్దకు చేరుకుని లీటర్ల కొద్దీ కల్లు సేవిస్తున్నారు. అయితే ఈ కల్లులో తీయదనం కోసం రసాయనాలు, మత్తు కోసం క్లోరోఫామ్ వంటి ప్రమాదకర పదార్థాలు కలుపుతున్నారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. డిపోల వద్ద కల్లు తాగినవారు ఇంటికి చేరుకునేలోపే మత్తులో రోడ్లపైనే పడిపోతున్న ఘటనలు పట్టణంలో నిత్యం కనిపిస్తున్నాయి.
ఇతర ప్రాంతాల నుంచి భారీగా దిగుమతి
సిరిసిల్ల పట్టణానికి జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, జమ్మికుంట వంటి పరిసర ప్రాంతాల నుంచి మినీ వ్యాన్ల ద్వారా మూడు రోజులకోసారి కల్లు సిరిసిల్లకు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఈ రవాణా పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఒకేసారి సుమారు 800 లీటర్ల వరకు అసలు కల్లు తీసుకువచ్చి, పట్టణ పరిధిలోని డిపోల వద్ద నిల్వ ఉంచుతున్నారని తెలుస్తోంది. అనంతరం ఈ అసలు కల్లులో నీరు, చక్కెర ద్రావణాలు, ఇతర రసాయన పదార్థాలు కలిపి పరిమాణాన్ని పెంచుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అసలు 800 లీటర్ల కల్లు రోజుకు వెయ్యి లీటర్లకు పైగా మారి మార్కెట్లో విక్రయమవుతోందని సమాచారం.ఈ విధంగా కల్తీ చేసి పరిమాణాన్ని పెంచడం ద్వారా వ్యాపారులు భారీ లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ముఖ్యంగా తక్కువ ధరకు ఎక్కువ మత్తు అందుతుందనే భావనతో కార్మిక వర్గం ఈ కల్లును అధికంగా వినియోగిస్తుండటంతో, ఈ అక్రమ వ్యాపారం మరింత విస్తరిస్తోంది.
అధికారికంగా నాలుగు డిపోలు…వాస్తవానికి ఎనిమిది
ఎక్సైజ్ శాఖ రికార్డుల ప్రకారం పట్టణంలో నాలుగు డిపోలకే అనుమతులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ,క్షేత్రస్థాయిలో మాత్రం ఎనిమిది వరకు డిపోలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి డిపో కింద నాలుగు నుంచి ఐదు దుకాణాలు పనిచేస్తుండటంతో విక్రయాలు భారీ స్థాయిలో సాగుతున్నాయి. అధికారుల ప్రకారం రోజుకు వంద లీటర్ల అమ్మకాలే ఉన్నాయని చెబుతుండగా, వాస్తవానికి ఐదింతలు ఎక్కువగా విక్రయమవుతున్నట్లు సమాచారం.
ఎక్సైజ్ తనిఖీలపై అనుమానాలు
కల్తీ నివారణకు తరచూ తనిఖీలు నిర్వహించాల్సిన ఎక్సైజ్ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా అనుమతుల జారీ, అవకతవకల నేపథ్యంలో ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితి మారలేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
సహజ కల్లు పరిమితంగా సేవిస్తే పెద్దగా హానికరం కాకపోయినా, రసాయనాలతో కలిపిన కల్లు ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కాలేయం, కిడ్నీ సమస్యలు, దృష్టి లోపాలు వంటి అనారోగ్యాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. సిరిసిల్లలో అనేక మంది కూలీలు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ కల్లు మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అక్రమ డిపోలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.


