నీటి సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం
జమ్మికుంట మునిసిపల్ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం
కాకతీయ, జమ్మికుంట : నీటి సమస్యల పరిష్కారమే ప్రాధాన్యమని మున్సిపాలిటీ పాలకవర్గం స్పష్టం చేసింది. వార్డు సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. జమ్మికుంట మున్సిపాలిటీలో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆధ్వర్యంలో, చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి ఎద్దడిని ఎదుర్కొనే చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. బోర్వెల్ల మరమ్మతులు, కొత్త వాటర్ ట్యాంకుల ఏర్పాటు, తాగునీటి సరఫరా మెరుగుదలపై చర్చించారు. పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
పాలకవర్గం కీలక నిర్ణయాలు
2026-27 ఆర్థిక సంవత్సరానికి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపు అంశంపై ఆమోదం తెలిపారు. పార్కుల్లో లైటింగ్ ఏర్పాట్లు, స్ట్రీట్ లైట్ల కొనుగోలు, హమాలి సంఘ కార్మికుల కోసం టాయిలెట్ బ్లాక్ నిర్మాణం వంటి మొత్తం 32 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. పారిశుధ్య పనుల నిర్వహణలో గ్యాంగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి వార్డుకు వేర్వేరుగా కాకుండా సమిష్టిగా పనులు చేపట్టే విధంగా కార్మికులను కేటాయించాలని సూచించారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ, ఏడి అహ్మద్, మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి, జేఏఓ రాజశేఖర్ రెడ్డి, ఏఈ వికాస్, టీపీఓ శ్రీధర్, రాజ్ కుమార్, దీపిక, సీనియర్ అసిస్టెంట్ వాణి, ఆర్ఐ భాస్కర్, ఎస్ఐ మహేష్తో పాటు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.


