ఏప్రిల్ 1 నుంచి మన ఇసుక వాహనంతో సరఫరా
ఆన్లైన్లో దరఖాస్తు తప్పనిసరి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అంతరాయం ఉండదు
కలెక్టర్ గరిమ అగ్రవాల్
కాకతీయ సిరిసిల్ల టౌన్ : ఏప్రిల్ 1 నుంచి మన ఇసుక వాహనం ద్వారా నిర్మాణ పనులకు ఇసుక సరఫరా ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇసుక సరఫరా విధానం, ఆన్లైన్ దరఖాస్తు విధానం, పర్యవేక్షణ అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కమిటీ ఆమోదించిన ఇసుక రీచ్ల నుంచే సరఫరా జరగాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇసుక అక్రమ రవాణాకు కట్టడి
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ఇసుక రీచ్లపై తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని ఇటుక బట్టీలు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ నిర్ణీత సమయంలోనే ఇసుక సరఫరా జరగాలని సూచించారు. అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో జిల్లా మైనింగ్ అధికారి క్రాంతి కుమార్, డీఎస్పీ నాగేంద్రచారి, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, నీటి పారుదల, భూగర్భ జల శాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎస్ హెచ్ ఓలు తదితరులు పాల్గొన్నారు.


