సర్పంచ్ నిర్ణయంపై వివాదం..
పురోహితుడు ఆత్మహత్యాయత్నం
శ్రీరామనవమి వేడుకల వేదిక మార్పుపై వివాదం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఎనుగల్ గ్రామంలో సర్పంచ్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ ఆలయ పురోహితుడు వెంకన్నచార్యులు మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో సంవత్సరాలుగా ఒకే వేదికపై శ్రీరామనవమి కల్యాణ మహోత్సవం నిర్వహించే సంప్రదాయం ఉంది. అయితే ఈ ఏడాది సర్పంచ్ ఎవరినీ సంప్రదించకుండా కల్యాణ వేదికను మార్చుతూ నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారితీసింది. దీనిపై పురోహితుడు, గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
గ్రామంలో ఉద్రిక్తత
ఈ క్రమంలో సర్పంచ్ పురోహితుడిని దూషించి అవమానించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన వెంకన్నచార్యులు పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంప్రదాయాలను గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురోహితుడి వైద్య ఖర్చులను సర్పంచ్ భరించాలని, ఘటనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అధికారులు స్పందించి పరిస్థితిని సమీక్షించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.


