నకిలీ వైద్యంపై టాస్క్ఫోర్స్ దాడులు
ఆకునూరులో నాలుగు కేంద్రాల గుర్తింపు
అర్హత లేకుండా వైద్యం… ప్రజల ప్రాణాలతో చెలగాటం
ఎంపీడీవో, పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖ సంయుక్తంగా తనిఖీలు
నలుగురి నకిలీ వైద్యుల గుర్తింపు.. ఒకరు పరారీలో
మెడికల్ షాప్ ముసుగులో క్లినిక్ నిర్వహణ
నార్కోటిక్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ స్వాధీనం
సర్జరీ పరికరాలు, ఐవి సెట్స్ పట్టివేత
కాకతీయ కథనానికి స్పందించిన అధికారులు

కాకతీయ, చేర్యాల : ఆకునూరులో వైద్యం పేరుతో వైద్యుల దోపిడీపై కాకతీయలో ప్రచురితమైన కథనానికి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ స్పందించారు. జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ఆకునూరు గ్రామంలో నకిలీ వైద్యంపై టాస్క్ఫోర్స్ కమిటీ ముకుమ్మడిగా దాడులు నిర్వహించింది. ఎంపీడీవో, ఎస్సై, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న నలుగురు వ్యక్తులను గుర్తించారు. ఈ తనిఖీల్లో శ్రీధర్, యాదగిరి, రాజేష్, విజయ్కుమార్ అనే వ్యక్తులు నకిలీ వైద్యం నిర్వహిస్తున్నట్లు బయటపడింది. అయితే శ్రీధర్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

యాదగిరి అనే వ్యక్తి బయట “లక్ష్మీనరసింహ” పేరుతో, డాక్టర్ గుర్తులతో బోర్డు పెట్టి, లోపల “నందిని మెడికల్ షాప్” పేరిట క్లినిక్ నిర్వహిస్తున్నాడు. మెడికల్ షాప్ రిజిస్ట్రేషన్ను ఇతరుల పేర్లపై తీసుకుని, తానే వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. తన వద్ద నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ కింద వచ్చే ట్రామడాల్, యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్కిల్లర్స్ భారీగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
రాజేష్ అనే వ్యక్తి నర్సింగ్ అర్హత కలిగినప్పటికీ ప్రస్తుతం ప్రాక్టీస్ చేయడం లేదని తెలిపాడు. అతని సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. విజయ్కుమార్ క్లినిక్ను అతని భార్య శిరీష తెరిపించగా, అక్కడ భారీగా మందులు, స్టెరాయిడ్స్, యాంటీబయోటిక్స్, వాడిన ఐవి సెట్స్, అలాగే కుట్లు వేసే సర్జరీ పరికరాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో బయటపడిన అంశాలు గ్రామాల్లో నకిలీ వైద్యం ఎంత విస్తృతంగా కొనసాగుతోందో స్పష్టం చేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ తరహా అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.



